'అనంత' తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ...
అనంతపురం : టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సాక్షిగా అనంతపురం టీడీపీ నేతల మధ్య వర్గ విభేదాలు వెలుగుచూశాయి. మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి వర్గీయుల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప వర్గీయులు పరస్పరం దాడికి పాల్పడ్డారు. రెచ్చిపోయిన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు, స్వరూప వర్గీయులపై దాడి చేయడంతో కృష్ణకుమార్, నారాయణస్వామి, ఉమా మహేశ్వర్ లకు గాయాలయ్యాయి. రెండు వర్గాల సభ్యులు కుర్చీలతో దాడికి దిగారు. వేరే వర్గం నేతల రక్తం కళ్లజూసిన సంఘటన అనంతపురం జిల్లా టీడీపీ నేతల మధ్య వర్గపోరును బయటపెట్టింది.
ఆదివారం అనంతపురంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడికి దిగారు. ఈ దాడిలో ఐదుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తమ వర్గం వారిపై ఎమ్మెల్యే మనుషులు దాడికి దిగారంటూ మేయర్ స్వరూప పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ 34వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ప్రభాకర్, మేయర్ స్వరూప వర్గీయులు బాహాబాహీకి దిగడం ఆ పార్టీ నేతలు జిల్లాలో ఆధిపత్యం కోసం దాడులకు సైతం వెనకాడక పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.