ఇంకా అంచనాల స్థాయిలో ఉంటే ఎలా ?

ఇంకా అంచనాల స్థాయిలో ఉంటే ఎలా ? - Sakshi


► అధికారులు జవాబుదారీ తనంతో పనిచేయాలి

► కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌


విజయనగరం కంటోన్మెంట్‌ : అంచనా స్థాయిలోనే ఇంకా పనులు ఉండటమేమిటని కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ సమావేశపు హాల్‌లో నీటి పారుదల, మున్సిపాలిటీ, పర్యాటకశాఖ, రెవెన్యూ, భూ సేకరణ, ఉడా, జిల్లా క్రీడాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల ప్రగతిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విజయనగరంలో సీసీ రోడ్లు, పార్కుల అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం సరికాదన్నారు.


ఈ పనులను ఎస్‌ఈ పర్యవేక్షించాలని ఆదేశించారు. అ«ధికారులు జవాబుదారీతనంతో పనిచేయకపోతే చర్యలు తప్పవన్నారు. జిల్లా కేంద్రంలోని మజ్జి గౌరమ్మ వీధిలో పనులు ప్రారంభించని కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలన్నారు. 26వ వార్డు ఆర్టీసీ కాలనీలో వాటర్‌ట్యాంకు.. 37, 39 వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల పనులు చేపట్టాలని ఆదేశించారు. మయూరీ జంక్షన్‌ నుంచి వెంకటలక్ష్మి థియేటర్‌ వరకూ రోడ్డు విస్తరణపై ఆరా తీశారు. ఉడా అధికారులు విజయనగరం అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు.


జిల్లాకు చెందిన ఉడా అధికారులు స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉడా వీసీకి లేఖ రాయాలని సీపీఓను ఆదేశించారు. జనతా బజారు దగ్గర షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. రానున్న వేసవిలో పట్టణంలో తాగునీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. స్లమ్‌ ఏరియాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడానికి రూ.94 లక్షలు విడుదల చేసినట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ చెప్పారు.


పట్టణంలో పందుల సంచారం పెరిగిపోయిందని, నివారణకు చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ అధికారులను కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశించారు. తోటపల్లి రిజర్వాయర్, తారక రామ తీర్థసాగర్‌ ప్రాజెక్ట్‌ కాలువల నిర్మాణ పనులకు అవసరమైన భూ సేకరణ వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి భూ సేకరణ, చెల్లూరు నుంచి రాజాపులోవ, విజయనగరం బైపాస్‌ రోడ్డు, సాలూరు బైపాస్‌ రోడ్‌ భూ సేకరణ వివరాలపై ఆరా తీశారు.


పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షిస్తూ నారాయణపురం వంతెన నిర్మాణం టెండర్‌ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో చంద్రన్న సంక్షేమ బాటలో 255 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు పూర్తి చేశామని పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు ఈ సందర్భంగా వివరించారు.  జిల్లా ఆస్పత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించాలని సూచించారు. సమావేశంలో జేసీ శ్రీకేశ్‌ బి. లఠ్కర్, ఆర్డీఓలు ఎస్‌. శ్రీనివాసమూర్తి, గోవిందరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కాంతిమతి, సీపీఓ విజయలక్ష్మి, పర్యాటక శాఖాధికారి ఎస్‌డీ అనిత, పబ్లిక్‌ హెల్త్‌ ఎస్‌ఈ  బీహెచ్‌ శ్రీనివాసరావు,  విజయనగరం మున్సిపల్‌ కమిషనర్‌ జి. నాగరాజు , మున్సిపల్‌ ఈఈ కె. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top