నేడు సీఎం రాక

నేడు సీఎం రాక - Sakshi

  • విజయవాడలో విస్తృత పర్యటన

  •  ప్రకాష్‌నగర్‌లో జన్మభూమికి శ్రీకారం

  •  ఎంబీపీ స్టేడియంలో ‘ఎన్టీఆర్ భరోసా’ప్రారంభం

  • సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడ రానున్నారు. రాష్ట్ర స్థాయిలో అమలు చేయనున్న పలు ప్రభుత్వ పథకాలను రాజధాని అయిన విజయవాడలోనే ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు నేతృత్వంలో ఉన్నతాధికారులు సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగర పోలీస్ కమిషనర్ పటిష్ట బందోబస్తు కల్పించారు.

     

    పర్యటన ఇలా..



    ముఖ్యమంత్రి గురువారం ఉదయం 9.15 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయలుదేరి 9.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం విజయవాడలోని ప్రకాష్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత 10.45 గంటలకు స్వచ్ఛ భారత్ ర్యాలీని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడే జన్మభూమి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఆ తర్వాత 10.55 గంటలకు ‘నీరు-చెట్టు’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.



    ఆ తర్వాత డాబాకొట్లు సెంటరుకు చేరుకుని ‘ఎన్టీఆర్ సుజల’ పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సింగ్‌నగర్‌లోనే ఉన్న మాకినేని బసవపున్నయ్య మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘ఎన్టీఆర్ భరోసా’ పేరుతో ఫించన్ల పంపిణీకి శ్రీకారం చుడతారు.



    మధ్యాహ్నం 1.30 గంటలకు స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత  2.30 నుంచి 3.15 గంటల వరకు ఇరిగేషన్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడతారు. అనంతరం 3.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top