రుణమాఫీ చేస్తే ‘లోటు’ లేదంటే ఎలా?
కేంద్రం తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి
సాక్షి, విజయవాడ బ్యూరో : రైతులను రుణ విముక్తి చేశారు కాబట్టి రాష్ట్రంలో లోటు బడ్జెట్ లేదని అంటే ఎలాగని సీఎం చంద్రబాబు పరోక్షంగా కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆదాయం చూసుకోకుండా మాఫీ చేశా రు కాబట్టి లోటు బడ్జెట్ కిందకు రాదనడం సరికాదన్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.10వేల కోట్లు ఇచ్చాం కాబట్టి లోటు లేదంటున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం మంత్రివర్గ సమావేశ వివరాలు వివరించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు.
విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా అన్యాయం చేశారని, ఇప్పుడు అదే పార్లమెంటు సాక్షిగా న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు.రాజ్యసభలో కాంగ్రెస్ ప్రైవేటు బిల్లుపై ఇదే విధానం అవలంబించాలని తమ ఎంపీలకు చెప్పినట్లు తెలిపారు. ఈ ప్రైవేటు బిల్లు పాసైనా చట్టం కాదని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీలతోపాటు విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని పదేపదే కోరుతున్నామన్నారు. ఇటీవల జరిగిన అంతర్రాష్ట్రాల సీఎంల భేటీలోనూ ఈ విషయం ప్రస్తావించినట్లు తెలిపారు.