'బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని బాబు నెరవేర్చలేదు'

'బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని బాబు నెరవేర్చలేదు' - Sakshi


అనంతపురం(గుంతకల్లు):  బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా బ్యాలెట్‌కు ఏపీ వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో శనివారం స్థానిక బీసీ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు బీసీలకు అనేక హమీలు ఇచ్చినా వాటిలో ఇంతవరకు ఏ ఒక్కటీ నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. ఈ నేపథ్యంలో బీసీలనే న్యాయనిర్ణేతలుగా ప్రకటిస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు వారికి ఇచ్చిన హామీలను ప్రజా బ్యాలెట్‌గా ముద్రించి ఈనెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరుల ముందుకు తీసుకువెళ్లామన్నారు.



ప్రజా బ్యాలెట్‌ను విడుదల చేసిన నాలుగు రోజుల్లోనే విశేష స్పందన వచ్చిందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడంతో ముఖ్యంగా గాండ్ల, ఉప్పర, పూసల, పద్మశాలి, నాయీబ్రాహ్మణ, దూదేకుల, కుమ్మర వర్గాలకు చెందిన వారు పూర్తిగా మోసపోయారన్నారు. అలాంటి వారంతా ప్రజాబ్యాలెట్‌లో విస్తృతంగా పాల్గొనాలంటూ ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు బీసీలకు ఇచ్చిన హమీలన్నీ అమలు చేసేవరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top