అమెరికాలో చిత్తూరు యువకుడి మృతి
చిత్తూరు (అర్బన్): అమెరికాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన అడ్లూరి సాయికుమార్ (23) మృతి చెందాడు. జిల్లాలోని వడ మాలపేట మండలం శ్రీ బొమ్మరాజపురానికి చెందిన అడ్లూరి చంద్రశేఖర్ రాజు, సుహాసినిల రెండో కుమారుడు సాయికుమార్ అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని డెక్లాబ్ నగరంలో నివాసముంటున్నాడు. ఇల్లినాయిస్ వర్సిటీలో ఎంఎస్ చదువు తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి స్నేహితుడి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సాయికుమార్ తిరుగు ప్రయాణంలో కారులో వస్తుండగా, వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో కారు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ విషయం చిత్తూరు జిల్లాలోని మృతుడి తల్లిదండ్రులకు ఆదివారం మధ్యాహ్నం తెలిసింది. మరో మూడు నెలల్లో కోర్సు పూర్తిచేసుకుని స్వదేశానికి వస్తాడనుకున్న కుమారుడి మరణవార్త తెలుసుకుని చంద్రశేఖర్, సుహాసినిలు కుప్పకూలిపోయారు. సాయి మృత దేహాన్ని తీసుకురావడానికి సాయం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో కేంద్రం చర్యలు చేపట్టింది. మంగళవారం మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.