ఆగస్టులో చిరంజీవి షష్టిపూర్తి వారోత్సవాలు

ఆగస్టులో చిరంజీవి షష్టిపూర్తి వారోత్సవాలు


సేవా కార్యక్రమాలు చేపట్టిన అభిమానులకు బంగారు పతకాలు

అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలుగు వారికి సన్మానాలు

కల్తీపై ప్రజా ఉద్యమాలు




ఏలూరు (పశ్చిమగోదావరి జిల్లా) : మెగాస్టార్ చిరంజీవి 60వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15 నుంచి 22 వరకు వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు తెలిపారు. ఆదివారం ఏలూరులో నిర్వహించిన చిరంజీవి యువత 3వ రాష్ట్ర సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నేత్రదానం, కిడ్నీ దానం, అవయవ దానం వంటి సేవా కార్యక్రమాలతోపాటు, అత్యధిక సార్లు రక్తదానం చేసిన చిరంజీవి అభిమానులకు బంగారు పతకాలు అందిస్తామని చెప్పారు.





ఈ మేరకు రామ్‌చరణ్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సుమారు వెయ్యి మంది అభిమానుల జాబితా సిద్ధం చేశారని తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలీ స్టేడియంలో నిర్వహించే చిరంజీవి జన్మదిన వేడుకల సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన సైనా నెహ్వాల్ (బ్యాడ్మింటన్), సానియా మీర్జా (టెన్నిస్), అంబటి తిరుపతి రాయుడు (క్రికెట్) వంటి తారలను, సాధారణ స్థాయి నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు(ఆర్‌ఎస్‌ఆర్)ను ఘనంగా సన్మానించడానికి చిరంజీవి నిర్ణయం తీసుకున్నారన్నారు. చిరంజీవి షష్టిపూర్తి రోజునుంచి ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ సరుకులపై ఉద్యమం ప్రారంభిస్తారన్నారు.



ఎక్కడ కల్తీ జరిగినట్టు తమ దృష్టికి వచ్చినా అభిమానులుగా తామే దాడులు నిర్వహిస్తామని, కల్తీ వ్యాపారులపై సంబంధిత అధికారులకు సమాచారం అందించి ప్రజా ఉద్యమంగా మలుచుతామని వివరించారు. చిరంజీవి కుటుంబంలో ఏమైనా స్పర్థలున్నా ఆయన అభిమానుల్లో ఎటువంటి మార్పు రాలేదని, ఇప్పటికీ చిరంజీవి కుటుంబ అభిమానులంతా ఒకే కుటుంబంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సమావేశంలో చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసాదరెడ్డి, ప్రధాన కార్యదర్శి కటకం రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి పెన్మెత్స సుబ్బరాజు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top