ప్రతిపక్షంగా ప్రజలకు బాసటగా ఉందాం..

ప్రతిపక్షంగా ప్రజలకు బాసటగా ఉందాం.. - Sakshi


- పార్టీ పటిష్టతకు పాటు పడదాం  

- జగన్ స్ఫూర్తితో పోరాడదాం

- తుని సమావేశంలో వైఎస్సార్ సీపీ శ్రేణులకు జ్యోతుల పిలుపు

తుని : ‘ఎన్నికలు ముగిసిన ఘట్టం.. ఇకపై అందరం పార్టీ పటిష్టతకు కార్మోన్ముఖులై, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజలకు బాసటగా ఉందాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాలకు తూర్పు సెంటిమెంట్‌తో శుక్రవారం తునిలో శ్రీకారం చుట్టారు. మర్చంట్స్ అసోషియేషన్ కళ్యాణమండపంలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అధ్యక్షతన జరిగిన సమావేశానికి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

 

ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఉత్తేజభరితంగా ప్రసంగించారు. పోరాట పటిమ ఉన్న పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని స్పూర్తిగా తీసుకుని ప్రజల తరఫున పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తండ్రి ఆశయసాధనకు జగన్ ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని అవిశ్రాంత పోరాటం చేస్తున్నారన్నారు. ఉచ్ఛనీచాలు లేని చంద్రబాబును ఎదుర్కోవాలంటే అంకితభావం కలిగిన కార్యకర్తలకు దన్నుగా నిలవాలని నేతలకు సూచించారు. పార్టీ కోసం పాటు పడే నేతలకు అండదండగా ఉండేందుకు తన కుటుంబాన్ని కూడా వదిలి సేవకుడిగా పనిచేస్తానని స్పష్టం చేశారు. జిత్తులమారి యనమల రామకృష్ణుడుని సవ్యసాచిలా ఎదుర్కొందామని భరోసానిచ్చారు. టీడీపీ నాయకులు గ్రామాల్లో దారుణమైన పరిస్థితిని సృష్టిస్తున్నారని, ఫించన్ ఏరివేతలో  వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులను ఇరికించాలని చూస్తున్నారని, నిజాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని జ్యోతుల అన్నారు.

 

నూరు పాత్రలు పోషిస్తున్న     టీడీపీ కార్యకర్తలు : జక్కంపూడి

పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ పార్టీని విజయవంతంగా నడపడంలో నాయకులు, కార్యకర్తలు భాగస్వాములు కావాలన్నారు. సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ సినిమా యాక్టర్లు రెండు, మూడు పాత్రలు పోషిస్తే, చంద్రబాబు టీడీపీ కార్యకర్తలు వంద పాత్రలు పోషించేలా చేస్తున్నారని విమర్శించారు. జక్కంపూడి రామ్మెహనరావు పోరాటస్ఫూర్తితో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని ఇప్పుడు ఉన్న జాబులకు మంగళం పలుకుతున్నారని విమర్శించారు.



పేదను ఎమ్మెల్యేని చేసిన జగన్ : వంతల

పేదరాలైన తనను జగన్ ఎమ్మెల్యే చేశారని రంపచోడవరం ఎమ్మెల్యే వంతం రాజేశ్వరి అన్నారు. వాగ్దానాలను నెరవేర్చే సంస్కృతి చంద్రబాబుకు లేదని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ధ్వజమెత్తారు. మీ ఇంటి పెద్ద కొడుకునై సెజ్ భూములన్నీ రైతులకు అప్పగిస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు సెంట్ భూమిని కూడా ఇవ్వని పరిస్థితికి తీసుకువచ్చారని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. సెజ్ భూములన్నీ జగన్‌వేనని మోసపూరితమై విమర్శలు చేశారని, అవి జగన్‌వేనని రుజువు చేస్తే పేదలకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అధికార పార్టీ ఆగడాలకు అడ్డూ అదుపూ లేదనడానికి తనపై పెట్టిన కేసే ఉదాహరణని యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్ అన్నారు.

 

పార్టీ రాష్ట కార్యదర్శలు జక్కంపూడి రాజా, గుండా వెంకటరమణ, పార్టీ కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, గిరజాల స్వామినాయుడు, తోట సుబ్బారావు నాయుడు,  పెండెం దొరబాబు, అనుబంధ విభాగాల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, గారపాటి ఆనంద్, రొంగలి లక్ష్మి ప్రసంగించారు. పార్టీ అధికార ప్రతినిధులు కొమ్మిశెట్టి బాలకృష్ణ, పి.కె.రావు, రావూరి వేంకటేశ్వరరావు, నాయకులు వాసిరెడ్డి జమీలు, అత్తిలి సీతారామస్వామి, విప్పర్తి వేణుగోపాల్, దుంగా రామసత్యనారాయణ, చెల్లుబోయిన శ్రీనివాస్, కుసుమంచి శోభారాణి తదితరులు పాల్గోన్నారు.

 

జ్యోతులకు సన్మానం

పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి తుని తొలిసారిగా వచ్చిన జ్యోతులను తుని నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఘనంగా సత్కరించారు. పూలమాలలు వేసి శాలువాతో సన్మానించారు. పలువురు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top