సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలన


సత్తెనపల్లి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 24న సత్తెనపల్లి నియోజకవర్గ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, రూరల్ జిల్లా ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ అధికార యంత్రాంగంతో కలిసి ఆదివారం పరిశీలించారు. చంద్రబాబునాయుడు సత్తెనపల్లి మండలం దూళిపాళ్ళ, కంకణాలపల్లిల్లో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లు పరిశీలించడంతోపాటు వెన్నాదేవి వద్ద నిర్మించిన 400 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభోత్సవం చేస్తారు.

 

 బాబు పర్యటన నేపథ్యంలో డాక్టర్ కోడెల శరభయగుప్తా హిందూ ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణాన్ని పరిశీలించి జిల్లా అధికారులతో అక్కడే హెలిప్యాడ్ తదితర ఏర్పాట్లపై  చర్చించారు. బహిరంగ సభ, రావడానికి ద్వారాలు, వీఐపీ గ్యాలరీలు, వాహనాల పార్కింగ్ తదితరవాటిపై చర్చ జరిపారు. ముఖ్యంగా భద్రతా దృష్ట్యా వచ్చేటప్పుడు ఒకవైపు, వెళ్లేటప్పుడు మరోవైపు ద్వారాలు ఉండేలా తదితర వాటిపై చర్చించారు. అనంతరం సత్తెనపల్లి మండలం వెన్నాదేవి వద్ద ప్రారంభానికి సిద్ధమైన 400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పరిశీలించేందుకు వెళ్లారు.

 

 ఉరుకులు.. పరుగులు..

 ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రులు ఈనెల 24న సత్తెనపల్లి పర్యటనకు రానున్న నేపథ్యంలో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. ఏర్పాట్ల పరిశీలనకు ఆర్సీఎం పాఠశాల వద్దకు స్పీకర్, కలెక్టర్, రూరల్ ఎస్పీ వస్తున్నారన్న సమాచారం రావడంతో స్థానిక అధికారులు ఆదివారం ఉదయం అక్కడ వేచి ఉన్నారు. అరగంట తరువాత  వాహనాలు అక్కడకు రాకుండా నేరుగా శరభయగుప్తా హిందూ ఉన్నత పాఠశాల వద్దకు వెళ్లడంతో ఉరుకులు, పరుగులతో మళ్లీ శరభయగుప్తా పాఠశాల వద్దకు చేరుకున్నారు. గతంలో ఇక్కడ జరిగిన బహిరంగ సభలు తదితర వాటిని ఉన్నతాధికారుల దృష్టికి స్తానిక అధికారులు తీసుకొచ్చారు. క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడంపై అధికారులతో చర్చించారు. వారి వెంట డీఆర్వో కొసన నాగబాబు, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ ప్రశాంతి, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పిన్నమనేని వెంకటరామారావు, సత్తెనపల్లి డీఎస్పీ ఎస్.ఆర్.వెంకటేశ్వరనాయక్, ఆర్డీవో జె.భాస్కరనాయుడు, తహశీల్దారు శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల సత్యబాబు, మున్సిపల్ ఆర్వో రంగారావు, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ రవికుమార్, ఆర్టీసీ డిపో మేనేజరు శృంగారపాటి వేదాంతరావు, అర్బన్ సీఐ సాంబశివరావులతో పాటు చంద్రబాబు ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బంది, పోలీసు అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, వైస్‌చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు, సత్తెనపల్లి ఎంపీపీ బొర్రా కోటేశ్వరరావు, టీడీపీ వాణిజ్య విభాం జిల్లా అధ్యక్షుడు పోతుగంటి రామకోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

 

 హెలిప్యాడ్ స్థలం పరిశీలన

 వెన్నాదేవి (సత్తెనపల్లి రూరల్): ఈ నెల 24 న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్య్యంలో ఏర్పాట్లను  స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, కలెక్టర్ కాంతిలాల్ దండే, రూరల్ జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఆదివారం పరిశీలించారు. అందులో భాగంగా వెన్నాదేవి సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న ప్లాట్లను పరిశీలించారు. పర్యటన సందర్భంగా వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలాన్ని పరిశీలించారు. కంకణాలపల్లి వెళ్లే దారిలో రైల్వే ట్రాక్ ఉండడంతో ఆ సమయంలో తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. రాకపోకలకు ఇబ్బంది లేకుండా అన్నిరకాల చర్యలు తీసుకొని పర్యటన విజయవంతమయ్యేలా చూడాలని ఆయన కలెక్టర్, రూరల్ ఎస్పీలకు సూచించారు. హెలీప్యాడ్  నిర్మాణానికి కావాల్సిన పనులను ఇంజినీరింగ్ అధికారులతోను చర్చించి రూట్‌మ్యాప్ తయారు చేయాలని సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top