‘నువ్వు లేక నేను లేను’ అంటూ..


తొండంగి(తూర్పుగోదావరి): నువ్వు లేకపోతే ఉండలేనంటూ వెంటపడి లోబర్చుకుని మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు పెళ్లి కోసం వివాహిత ఆందోళన చేసింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి తొండంగిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని శృంగవృక్షం గ్రామానికి చెందిన వి.ప్రసన్న కుమారికి, తొండంగి గ్రామానికి చెందిన ఎం.శ్రీధర్‌కు నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ప్రసన్నకు శ్రీధర్‌ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఈ విషయం ప్రసన్న తల్లిదండ్రులకు తెలియడంతో సుమారు ఏడాదిన్నర కింద దగ్గరి బంధువైన మరో వ్యక్తితో వివాహం చేశారు.



పెళ్లైన తర్వాత కూడా శ్రీధర్‌ ప్రసన్నకు నువ్వు లేకపోతే ఉండలేను అంటూ పెళ్లి చేసుకుంటానని తెలపడంతో ఆ మాటలు నమ్మిన ప్రసన్న పెళ్లైన భర్తను వదిలి వచ్చేసింది. పెళ్లి చేసుకుంటానని తెలిపిన శ్రీధర్‌ మొహం చాటేయడంతో కుటుంబసభ్యులతో కలిసి ప్రియుడి ఇంటి వద్ద ఆందోళన చేసింది. తనకు న్యాయంగా చేయాలంటూ వాపోయింది. లేనిపోని మాటలతో తమ కుమార్తెకు మాయమాటలు చెప్పడంతో కాపురం వదిలి వచ్చిందని, ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే కుమార్తె జీవితం వీధిన పడుతుందని ప్రసన్న తల్లిదండ్రులు వాపోతున్నారు. తమకు న్యాయం జరిగేందుకు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే సదరు ప్రియుడు శ్రీధర్‌కు వివాహం కావడంతో భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top