చందాల సొమ్ముతో సోకులా!

చందాల సొమ్ముతో సోకులా! - Sakshi


చంద్రబాబు దుబారాపై  సర్వత్రా విమర్శలు

ఏపీ రాజధాని కోసం విరాళాలకు సర్కారు పిలుపు

ఇష్టానుసారం ఖర్చు చేయడంపై సర్వత్రా విస్మయం


 

హైదరాబాద్:  ఒకపక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ ప్రతి కార్యక్రమానికీ విరాళాలు వసూలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. మరోపక్క చేస్తున్న దుబారా వ్యయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కార్యాలయాల ముస్తాబుకు, కన్సల్టెన్సీలకు, ప్రత్యేక విమానాలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించడం విమర్శలకు తావిస్తోంది. విరాళాలు అడుగుతున్నందున ఆ నిధుల వ్యయంపై జవాబుదారీతనంతో వ్యవహరించాల్సి ఉండగా.. ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా రాజధాని కోసం ప్రతి నెలా ఒకరోజు వేతనం ఇవ్వాలని, ఉగాది సందర్భంగా గత శనివారం చంద్రబాబు పిలుపునివ్వడంపై ఉద్యోగవర్గాల్లో ఆందోళన నెలకొంది. ఒక చేత్తో పీఆర్సీ ఇచ్చినట్టే ఇచ్చి.. మరోచేత్తో రాజధాని చందాల పేరుతో పెరిగే వేతనాన్ని లాగేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారని ఉద్యోగులు అంటున్నారు.



ప్రతినెలా ఒకరోజు వేతనానికి సంబంధించి ప్రత్యేకంగా కార్యక్రమం చేపడతామని కూడా సీఎం ప్రకటించడంతో.. ప్రతి నెలా ఒకరోజు వేతనాన్ని అధికారికంగానే లాగేసుకుంటారేమోనని వారు భయపడుతున్నారు. ఒకపక్క విరాళాలు కోరుతూ మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయాల సోకుల కోసం, ఫర్నిచర్ కోసం, ప్రత్యేక విమానాల కోసం వృథాగా చేస్తున్న వ్యయంపై ఉన్నతస్థాయి వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. స్మార్ట్ వార్డు లు, స్మార్ట్ గ్రామాలకు విరాళాలివ్వాలంటూ.. వాటి ప్రచారం కోసం జిల్లాకు కోటి చొప్పున రూ.13 కోట్లు ఖర్చు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనులను భారీ ఖర్చుకు సిద్ధమై విదేశీ కన్సల్టెంట్లకు అప్పగించడంపై కూడా ఉన్నతస్థాయి అధికారవర్గాల్లో అభ్యం తరాలున్నాయి. ప్రజల నుంచి విరాళాల రూపంలోనైనా, లేదా పన్నుల రూపంలోనైనా వచ్చే ప్రతి పైసాను ప్రజలకు ఆస్తుల కల్పనకు, వారికి మౌలిక వసతుల కల్పనకు వెచ్చించాలి కానీ.. ఈ విధంగా దుబారా చేయడం ఏమిటని అధికార యంత్రాంగమే ప్రశ్నిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని 12,921 గ్రామాల్లో 1,384 గ్రామాలను, 3,463 మున్సిపల్ వార్డుల్లో 279 వార్డులను దత్తత తీసుకోవడానికి దాతలు ముందుకు వచ్చారు. స్మార్ట్ వార్డులు, గ్రామాలకు విరాళాలు ఇచ్చేవారికి ఆదాయపు పన్ను రాయితీ ఇప్పించేందుకు సైతం ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ నిధులను మాత్రం ఇష్టానుసారం ఖర్చు చేస్తోందని అధికారులు విమర్శిస్తున్నారు.  ఎమ్మెల్యే లకు బడ్జెట్ సమావేశాల కానుక కింద అత్యాదునిక ఐ ఫోనులు ఇవ్వడానికి కోటిన్నర రూపాయలను వ్యయం చేస్తున్నారు. అసెంబ్లీకి కేటాయించిన నిధుల్లో మిగుళ్ల నుంచి ఐ ఫోన్లను కొనుగోలు చేసి ఎమ్మెల్యేలకు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి పేర్కొనడం గమనార్హం.

 

 

 

విరాళాల  వసూలు ఇలా..


 

రాజధానితో పాటు గ్రామాలు, వార్డులు బాగు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రజల నుంచి విరాళాలు కోరుతోంది. స్మార్ట్ వార్డులు, స్మార్ట్ గ్రామాల పేరుతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విరివిగా విరాళాలు ఇవ్వాలని సర్కారు పిలుపునిచ్చింది.ఎన్టీఆర్ సుజల స్రవంతి కార్యక్రమానికి కూడా ప్రభుత్వం విరాళాలు వసూలు చేస్తోంది. తాజాగా రాజధాని కోసం ఉద్యోగులు ప్రతి నెలా తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని చంద్రబాబు కోరారు.

 

ఇలా దుబారా..


 

సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయాల సోకుల కోసం, ఫర్నిచర్ కోసం ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు చేశారు.రాష్ట్రంలో జిల్లాల పర్యటనలకు, ఢిల్లీ, సింగపూర్ పర్యటనలకు రెగ్యులర్ విమానాలున్నా.. ప్రత్యేక విమానాల్లో కేవలం 63 సార్లు చేసిన ప్రయాణాలకే ఏకంగా రూ.15 కోట్లు వెచ్చించారు.స్మార్ట్ వార్డులు, గ్రామాల ప్రచారం కోసం జిల్లాకు కోటి రూపాయల చొప్పున రూ.13 కోట్లను వ్యయం చేశారు.ఏడు మిషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకోసం నియమించిన కన్సల్టెన్సీలకు చెల్లించేందుకు 2015-16 బడ్జెట్‌లో ఏకంగా రూ.50 కోట్లు కేటాయించింది.ముందస్తు బడ్జెట్ సమావేశాలంటూ విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించడం ద్వారా కోటి రూపాయలు ఖర్చు పెట్టారు.



{పజా ప్రతినిధులు, అధికారులకు యోగా పేరుతో ప్రైవేట్ హోటల్‌లో మూడు రోజుల ఏర్పాట్లకు కోటిన్నర రూపాయలు వ్యయం చేశారు.   విజన్ 2029 డాక్యుమెంట్ తయారీ బాధ్యతను మెజర్స్ ఎర్నెస్ట్ అండ్ యంగ్ కన్సల్టెన్సీకి అప్పగిస్తూ అందుకు గాను రూ.12.62 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విచిత్రంగా ఈ సంస్థకు రూ.1.12 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా చెల్లించారు.    నీరు-చెట్టు కార్యక్రమం ప్రచారం కోసం ఏకంగా రూ.5 కోట్లు కేటాయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top