చంద్రబాబు బెదిరింపులు
అమరావతి: శాసనసభ సాక్షిగా విపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బెదిరింపులకు దిగారు. అవినీతిపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్ష సభ్యులను తీవ్రంగా హెచ్చరించారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అధికారపక్ష సభ్యులు అవినీతి ఆరోపణలు చేయడంతో వైఎస్సార్ సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిపై చర్చకు పట్టుబట్టారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకుని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘నేను వార్నింగ్ ఇస్తున్నా. విపక్ష సభ్యులు ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. నోటికి వచ్చినట్టు మాట్లాడడం సరికాదు. గొడవ పెట్టుకోవడానికే వాళ్లు వచ్చారు. నోటికి అంతుపొంతు లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ల రౌడీయిజం ఇక్కడ జరగదు. రాష్ట్రంలో ఎక్కడా రౌడీయిజం జరనివ్వం. అసెంబ్లీ, స్పీకర్ అంటే వీళ్లకు గౌరవం లేదు. వీరిపై స్పీకర్ చర్య తీసుకోవాలని గట్టిగా కోరుతున్నాన’ని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అవినీతి లేకుండా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అవినీతిపై చర్చకు సిద్ధమని ప్రకటించారు.