'మోదీ పాదాల వద్ద సాగిలపడ్డ బాబు'

'మోదీ పాదాల వద్ద సాగిలపడ్డ బాబు'


అనంతపురం టౌన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.  ఒత్తిడి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది.. మోదీ పాదాల వద్ద ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సాగిలపడుతున్నార’ని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. శనివారం అనంతపురంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఆయన ఆపార్టీ నాయకులు తులసిరెడ్డి, సాయిప్రతాప్, శైలజానాథ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఏడాది పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందాయన్నారు.



ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ప్రభుత్వం మాటమార్చిందన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని విభజన చట్టంలో ఉంటే భిక్షం వేసినట్లు రూ. 350 కోట్లు ఇచ్చిందని దుమ్మెత్తిపోశారు. తన వరకు వచ్చేసరికి అహ్మదాబాద్ నుంచి ముంబాయి వరకు రైల్వే లైన్‌కు రూ.60 వేల కోట్లను మంజూరు చేశారన్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎంపీలు చేతకాని దద్దమ్మలా ఉండి రాష్ట్రానికి విభజన హక్కులను సాధించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పూర్తిచేయడానికి కాలువ గట్ల మీద నిద్రపోతానని చంద్రబాబు చెబుతున్నాడని, అయితే పనులుకూడా అలానే నిద్రపోతున్నాయన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top