రాజధానిపై అసెంబ్లీలో సీఎం ప్రకటన వాయిదా
హైదరాబాద్ : అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై అసెంబ్లీలో ప్రకటన వాయిదా పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం రాజధానిపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం తిథి అష్టమి.. మంచిరోజు కాకపోవటంతో పాటు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా సభలో లేకపోవటం వల్ల ఈ ప్రకటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. దాంతో దశమి రోజైన గురువారం నాడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏపీ రాజధానిపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
కాగా శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులపై ఏపీ సర్కారు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యే కొత్త రాజధాని అని మంత్రివర్గలో చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు అదే అంశాన్ని అసెంబ్లీ కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, అది కేవలం సలహా మాత్రమేనని ఆయన తన సహచరులతో అన్నట్లు సమాచారం.