జగన్ను ఎదుర్కోలేకపోయినందుకు చంద్రబాబు అసంతృప్తి
హైదరాబాద్: శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన రెడ్డిని సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోతే ఎలా అని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను, తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. ఈ రోజు సభలో తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్కు సరిగా కౌంటర్ ఇవ్వలేకపోవడం పట్ల టీడీఎల్పీ సమావేశంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు మరింత చురుకుగా ఉండాలని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రతి ఒక్కరు హాజరుకావాలన్నారు.
హత్యా రాజకీయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశం ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వ్యవసాయం దండగన్న మాటల నుంచి బయటపడేందుకు తనకు కొన్ని సంవత్సరాల సమయం పట్టిందన్నారు. రుణమాఫీ అమలుకు రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. రుణమాఫీ అమలుకు రిజర్వ్బ్యాంక్ అంగీకరించడంలేదని చెప్పారు.
గత ప్రభుత్వం హయాంలో పింఛన్లు, రేషన్ కార్డులు కట్చేస్తే ఎలా ఉంటుందని మంత్రులను, ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రశ్నించారు. పథకాలు జోలికి వెళ్లకూడదని మంత్రులు, ఎమ్మెల్యేలు సూచన చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్రేడింగ్లు ఇస్తానని చంద్రబాబు చెప్పారు. 37 నుంచి 12 శాతం గ్రేడింగ్ వచ్చిన మంత్రులున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి పనిని కార్యకర్తలకు చెప్పి చేయలేం అని అన్నారు. కేసీఆర్తో చర్చలు మంచి వాతావరణంలోనే జరిగాయని చంద్రబాబు చెప్పారు.