రుణమాఫీ.. రైతుకు టోపీ

రుణమాఫీ.. రైతుకు టోపీ


కాళ్ల : రుణమాఫీ ముసుగులో రైతుల నెత్తిన సర్కారు టోపీ పెడుతోంది. వారుుదా మీరిన రుణాలపై 13 శాతం (నూటికి సుమారు రూ.1.08 పైసలు) వడ్డీ విధిస్తూ అన్నదాతలకు షాకిచ్చింది. సెప్టెంబర్ 1 నాటికి గడువు దాటిన రుణాలపై 13 శాతం వడ్డీ వసూలు చేయూలంటూ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) నుంచి సొసైటీలకు సర్క్యులర్లు అందాయి. ఆప్కాబ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సర్క్యులర్‌లో డీసీసీబీ పేర్కొంది. జిల్లాలోని 258 సహకార సంఘాల ద్వారా సుమారు 2 లక్షల మంది రైతులకు ఏటా సుమారు రూ.1,110 కోట్లను డీసీసీబీ పంట రుణాలుగా అందజేస్తోంది. రెండేళ్లుగా సున్నా శాతం వడ్డీకే (వడ్డీ లేని) రుణాలు అందిస్తోంది. ఈ ఏడాది రుణమాఫీని సాకుగా చూపించి సున్నా శాతం వడ్డీ అమలును మాయం చేశారు.

 

 అసలుకే ఎసరు

 రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో చాలామంది రైతులు రుణాలను చెల్లించలేదు. సర్కారు ప్రకటనపై నమ్మకం లేని కొందరు మాత్రం రుణాలను సొసైటీలకు కట్టేశారు. సకాలంలో చెల్లించిన రైతులకు సున్నా శాతం వడ్డీని అమలు చేయాల్సి ఉంది. రుణమాఫీ సంగతి దేవుడెరుగు కనీసం సకాలంలో సొమ్ములు కట్టిన రైతుల నుంచీ ఏడా ది వరకు 7 శాతం, తదనంతరం 11.75 శాతం చొప్పున సహకార సంఘాలు వడ్డీ వసూలు చేస్తున్నాయి. తాజాగా ఏడాది దాటిన బకాయిలపై సెప్టెంబర్ 1నుంచి 13 శాతం వడ్డీ వసూలు చేయాలని గుట్టుచప్పుడు కాకుండా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇది ఆప్కాబ్ తీసుకున్న నిర్ణయమని, ఇందులో తాము చేయగలిగిందేమీ లేదని సహకార సంఘాలు చేతులెత్తేస్తున్నాయి.

 

 మాఫీ చేసినా భారమే

 వాయిదా మొత్తాలు చెల్లించిన రైతులపై వడ్డీ భారం రోజురోజుకూ పెరుగుతోంది. మిగిలిన వారికి రుణం మాఫీ అవుతుందో లేదో తెలియదుకానీ.. వడ్డీ మాత్రం తడిపి మోపెడయ్యేలా కనపడుతోంది. 2013 డిసెంబర్ వరకు తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని, 2014 జనవరి నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి ఒక్క పైసా కూడా మాఫీ కాదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ముందుగా రుణమాఫీలో 20 శాతం మాత్ర మే ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రకారం చూస్తే సర్కారు ఇచ్చే 20 శాతం మాఫీ సొమ్ము వడ్డీలకు మాత్రమే సరిపోతుంది. దీనివల్ల రైతులు కొత్త రుణాలు పొందే అవకాశం కోల్పోతున్నారు. పోనీ.. పాత రుణాలు చెల్లించి, కొత్తగా రుణాలు తీసుకుందామంటే వడ్డీ భారం మోయలేని పరిస్థితి నెలకొంది. రుణమాఫీ విషయంలో సర్కారు అనుసరిస్తున్న సాచివేత ధోరణి వల్ల అన్నదాతలు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను కొలిక్కి తీసుకువచ్చి రైతులకు  సున్నా శాతం వడ్డీకే రుణా లు అందించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top