ఇంత నీచానికి ఒడిగడతాడని ఊహించలేదు..

ఇంత నీచానికి  ఒడిగడతాడని ఊహించలేదు.. - Sakshi


చంద్రబాబు తీరుపై ఎన్టీఆర్ ఆక్రోశం

 


తమ్ముళ్లారా.. చెల్లెళ్లారా.. ఇదిగో మీ అన్నను మాట్లాడుతున్నాను. శ్రద్ధగా వినండి. మీ బుద్ధితో ఆలోచించండి. మీ నిర్ణయంతో నన్ను ఆదేశించండి. నాటి నుంచి నేటి వరకూ జరిగిన చరిత్రను మీ ముందు, అంటే ప్రజా న్యాయస్థానం ముందుంచుతున్నాను. మంచేదో చెడేదో; నిజమేదో అబద్ధమేదో; ఆశయమేదో ఆశేదో మీకు తెలియాలనే ఈ ప్రయత్నం. నీతికీ అవినీతికీ మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో న్యాయనిర్ణేతలు మీరే. ఎవరు విజేతలో తేల్చాల్సింది కూడా మీరే ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. దివంగత ఎన్‌టీ రామారావు. వెన్నుపోటు పొడిచి గద్దె దింపిన తన అల్లుడు చంద్రబాబు గురించి ఎన్టీఆర్ చెప్పిన మాటలివి. ఆ సమయంలో ఆయన వెళ్లగక్కిన ఆవేదన ఆయన మాటల్లోనే..

 

బాబు ఒక చిన్న మిడత..

‘‘224 సీట్లతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రాభవాన్ని ప్రతిఘటించడం చేతకాని వ్యతిరేక శక్తులు కొంతమంది లోలోన (1995లో) గూడుపుఠాణీ ఆరంభించారు. దానికి గురువు, ఈ కుట్రకు కొలువు, మోసానికి మూలస్తంభం చంద్రబాబునాయుడు! నా అల్లుడనబడుతున్నవాడే నా గుండెల్లో చిచ్చుపెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి ముందు అతనేమిటో మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్‌లో ఉంటూ, మంత్రులపై కూడా పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి, చివరకు టీడీపీ మహా ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఓ చిన్న మిడత. టీడీపీ అధికారంలోకి వచ్చాక, అతను పార్టీలో చేరతానని వస్తే, చేర్చుకోవద్దని కొందరు హితవు చెప్పారు. అయినప్పటికీ... పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు కదా అని ఔదార్యంతో చేర్చుకున్నాం. తర్వాత పార్టీలో ముఖ్యమైన పదవులన్నీ ఇచ్చాను. అయితే అతడు ప్రజాసేవ కోసం కాక పదవి కోసమే పార్టీలో చేరాడన్న దుర్మార్గాన్ని నేను కనిపెట్టలేకపోయాను. అతడు కడుతున్న ముఠాల గురించి, చేరదీస్తున్న గ్రూపుల గురించి పట్టించుకోలేదు. అతడిలో పదవీ కాంక్ష ఇంతగా గూడుకట్టుకుంటుందని, అతడి వల్ల ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం తప్పుకోవాల్సి వస్తుందని, అతని వల్ల ప్రజాభీష్టమే వ్యర్థమై పోతుందని, ప్రజాస్వామ్యం పట్టపగలే హత్యకు గురవుతుందని, అధికారం కోసం ఇంతటి అల్పమైన నీచమైన దారుణమైన వెన్నుపోటుకు కూడా సిద్ధపడతాడని నేను ఊహించలేకపోయాను.



నా మీద ఒక అభియోగం సృష్టించాడు. కార్యకర్తలకేదో అన్యాయం జరిగిందట. ఏమిటా అన్యాయం? ఎవరికా అన్యాయం? పార్టీ పట్ల శ్రద్ధాభక్తులతో, అంకితభావంతో పనిచేసి ప్రజల విశ్వాసం చూరగొన్న నా కార్యకర్తలెవరికీ, నా తెలుగు తమ్ముళ్లకూ అన్యాయం జరగలేదు. ఒకవేళ ఏదైనా లోటు జరిగితే అది అవకాశవాదులకు మాత్రమే జరిగింది! చంద్రబాబు.. ఆ పెద్దమనిషి.. ఆ మేకవన్నె పులి.. ఆ తేనెపూసిన కత్తి తయారుచేసిన కుట్రదారులకే జరిగింది!! అతడి పక్కన చేరి కుహనా కార్యకర్తలుగా చెలామణి అయి, దళారీలుగా ఉన్నవారికే జరిగింది!!



పేరు చెప్పేందుకూ అనర్హుడే

‘ఇవాళ నేను మాట్లాడుతున్న వ్యక్తి ఓడిపోయి టీడీపీ లోకి వచ్చాడు. నా విధానాలకు పూర్తిగా అంకితమవుతానని మాటిచ్చాడు. కానీ అతని మనసులో ఉన్న దురాశ పోలేదు. నేనిన్ని పదవులిచ్చాను. కానీ ఆయన తనకంటూ ఓ గుంపును తయారు చేసుకున్నాడు. అది నేను గమనించలేదు. ఎవరూ ఊహించని విధం గా(1994 ఎన్నికల్లో) మాకు 214 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత పార్టీలో చేరిన వారితో చూసుకుంటే 224 సీట్లు! కాబట్టి వాళ్లేం చేయలేకపోయారు. అదే ఏ 130, 140 సీట్లో వచ్చుంటే వాళ్లేమైనా చేసి ఉండేవాళ్లు. ఎందుకంటే అంతకు ముందే రంగం ఏర్పాటై ఉంది. అందరికీ డబ్బిచ్చాడు ఆయన. ఆయన పేరు చెప్పడం నాకిష్టం లేదు. పేరు చెప్పేందుకు కూడా ఆయన అర్హుడు కాదు. అందరికీ 5 లక్షలు, 10 లక్షలు డబ్బులిచ్చి ‘ఇదిగో ఎన్నికల కోసం మీ అందరికీ డబ్బిస్తున్నాను. మీరంతా నా మనుషులుగా ఉండాలి’ అంటూ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఎప్పుడైతే 224 సీట్లు టీడీపీకీ వచ్చాయో ఆయన ఆటలు సాగలేదు. తప్పనిసరిగా ఎన్టీఆర్‌నే నాయకుడిగా ఎన్నుకోవాల్సి వచ్చింది. కానీ ఎలాగైనా సీఎం కావాలన్న ఆశ మాత్రం చావలేదు. ఆ ఆశతోనే తన గ్రూపును తయారు చేశాడు. ఇట్స్ ఏ ప్లాన్‌డ్ ట్రెచెరీ!’’



మరో ఔరంగజేబు..

‘‘చరిత్రను చూస్తే.. తండ్రిని జైల్లో పెట్టిన సమ్రాట్లున్నారు. రాజ్యాధికారం కోసం అన్నల్ని చంపిన సోదరుడున్నాడు.. ఔరంగజేబు. అలాంటి దురదృష్టకరమైన ఘటన ఇన్ని వందల ఏళ్ల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అలాంటి చిన్నబుచ్చేతనాన్ని మన జాతి అనుభవించడం అనేది కేవలం నేను చేసుకున్న పాపం. ఎందుకంటే నా వాళ్లుగా ఉంటూ ఈనాడు జాతికే ద్రోహం చేసి మాయని మచ్చను తెచ్చారు. ప్రజాస్వామ్యానికిది చిన్నతనం. నేను శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వెళ్లినప్పడు (1995 ఆగస్టు 23 నాటి వెన్నుపోటుకు కొద్ది రోజుల ముందు) అక్కడ ఈ మహానుభావుడే.. ఎవరైతే ఈనాడు జాతికే చిన్నతనం తెచ్చారో, అవమానకరంగా వ్యవహరించారో, తెలుగుజాతిని కించపరిచారో ఆ మహానుభావుడే, ‘రామారావు గారు లేకపోతే మా పార్టీ(తెలుగుదేశం) లేదు. ఆయన వల్లే పార్టీ నడుస్తోంది. మేమాయన వెనకాల ఉంటున్నాం. ఈ ఖ్యాతి, గౌరవం అంతా ఆయనదే. రామారావే మా నాయకుడు’ అన్నాడు. అలా చెప్పిన వాడే 23వ తేదీ సాయంత్రానికల్లా ఎందుకు మారారంటారు?’’



బాబును చరిత్ర క్షమించదు

‘‘అయామ్ ద లయన్. నేనే సింహాన్ని. ఎందుకంటే సింహం మృగరాజు. ఏ అవమానాన్నీ సహించదు. నాకెలా అవమానం జరిగింది. నా వాళ్లు, నా అన్నవాళ్లు నన్ను ఏ విధంగా మోసం చేశారో ప్రజలకు తెలుసు. అయినా చెప్పడం నా ధర్మం. నా కర్తవ్యం. ప్రజల ప్రతినిధిని నేను. నాకేం జరిగినా ప్రజలకు తెలియజెప్పడం నా బాధ్యత. దేవుడు సహా ఎవరూ క్షమించలేని ఘాతుకానికి బాబు ఒడిగట్టాడు. దీన్ని జాతి, చరిత్ర ఎప్పటికీ క్షమించదు..’’ అంటూ ఎన్టీఆర్ తన ఆవేదనను వెళ్లగక్కారు.

 

గాడ్సేను మించినవాడు..

‘‘ఈ వెన్నుపోటు జరిగింది నాకొక్కడికి మాత్రమే కాదు. ప్రజలకు, మీరు వేసిన ఓటుకు, మీరు నమ్మిన ప్రజాస్వామ్యానికి, మీరు విశ్వసించిన ఆశయాలకు, ఆదర్శాలకు ఇది వెన్నుపోటు! ఇంత నీచానికి ఒడిగట్టిన చంద్రబాబు... ఎన్టీఆర్‌లాగే ఆయన విధానాలే కొనసాగిస్తామని చెబుతుంటే ఎలా ఉందో తెలుసా? చేతులు జోడించి, నమస్కారం చేసి, తుపాకీ పేల్చి గాంధీ మహాత్ముడ్ని పొట్టనబెట్టుకున్న గాడ్సేనే మించిపోయాడనిపిస్తోంది. ఇది సిగ్గుచేటు, క్షమించరాని నేరం. వీళ్లంతా ఇలా ఎందుకు చేశారు. ఎందుకు వెన్నుపోటు పొడిచారు? ఏమిటి ఎన్టీఆర్ చేసిన తప్పు? ఏమిటి ఎన్టీఆర్ చేసిన నేరం?’’

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top