మోదీ సర్కార్పై చంద్రబాబు విమర్శలు


హైదరాబాద్: ఎన్డీయేకు మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేది మరొకటని చంద్రబాబు విమర్శించారు. గతేడాది కేంద్రంలో ఎన్డీయే, ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నరేంద్ర మోదీ సర్కార్పై విమర్శలు చేయడం ఇదే తొలిసారి.  



శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోందని ఆర్థిక సాయం చేయాలని పలుమార్లు కేంద్రాన్ని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని మోదీని పలుమార్లు కలసి విన్నవించినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి తగిన నిధులు కేటాయించలేదని అన్నారు. ప్రజల నమ్మకాలను పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. కేంద్ర ఆర్థిక సంఘం తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని మోదీ సరిదిద్దాలని బాబు కోరారు. మరోసారి ఢిల్లీ వెళ్లి మోదీని కలుస్తానని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top