శ్రీలంక చేరుకున్న చంద్రబాబు బృందం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో భాగంగా శ్రీలంక చేరుకున్నారు. ఆయనతోపాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా పర్యటనలో పాల్గొంటున్నారు. ప్రత్యేక విమానంలో బయల్దేరిన చంద్రబాబు కొలంబో చేరుకోగానే ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. శ్రీలంకకు చెందిన పలువురు నాయకులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఐఏఎస్ అధికారులు జి.సాయి ప్రసాద్, బి.రామాంజనేయులు, బి.రాజశేఖర్, మెప్మా డైరెక్టర్ తదితరులు కూడా చంద్రబాబు వెంట ఉన్నారు. శ్రీలంక అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ఈ పర్యటనకు వెళుతున్నట్లు ఇంతకుముందు తెలిపారు.
కాగా, శ్రీలంక నుంచి తిరిగి వచ్చి సంక్రాంతి పండుగ చేసుకున్న తర్వాత మళ్లీ 16వ తేదీ 21 వరకు నుంచి చంద్రబాబు స్విట్జర్లాండ్లో పర్యటించనున్నరు. ప్రపంచ ఆర్థికసంస్థ ఆహ్వానం మేరకు స్విట్జర్లాండ్ లో పర్యటనకు వెళుతున్నారని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పర్యటనలో మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు కమ్యూనికేషన్స్ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎం ముఖ్యకార్యదర్శి జి.సాయిప్రసాద్, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సోల్మన్ అరోకియా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్తికేయ మిశ్రాలతో పాటు మరో అయిదురుగు చంద్రబాబు వెంట వెళతారు.