విషాదం నింపుతున్న రోడ్డు ప్రమాదాలు

విషాదం నింపుతున్న రోడ్డు ప్రమాదాలు - Sakshi


*వరుస ప్రమాదాల్లో బలవుతున్న ప్రముఖులు

*ప్రాణాలు తీస్తున్న అతి వేగం

*గమ్యస్థానానికి చేరాలన్న తొందరలో దూకుడు ప్రయాణం

*సీటు బెల్ట్‌ వాడరు

*ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన

*డ్రైవర్ల పట్ల పర్యవేక్షణా లోపం

*చిన్న అశ్రద్ధకు భారీ మూల్యం

*రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది బలి


త్వరగా వెళ్లాలనే ఆరాటం... ఆ ఆత్రుతే ప్రాణాల మీదకు తెస్తోంది... ఆ తొందర్లోనే చిన్న చిన్న జాగ్రత్తలను గాలికి ఒదిలేయడం ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఎందరో ప్రముఖులు, మరెంతో మంది భవిష్యతారలు ఇలాగే మృత్యువాతపడ్డారు.



అతి వేగం ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తుంటుంది. కాని భయపడేవారేవరూ. కేర్‌లెస్‌గా ఉండటమే తమకు ఇష్టమని ఆధునిక యూత్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌తో మరీ చెప్తోంది. వేగంగా వాహనాలు నడిపి ప్రాణాలు పొగొట్టుకుంటే... ఎవరికి నష్టం.  చెట్టంత ఎదిగిన కొడుకులు కళ్ల ముందు కన్నుమూస్తే ఆ తల్లిదండ్రులు పడే వేదనను ఎవరు తీర్చుతారు?



*శోభానాగిరెడ్డి

వైఎస్ఆర్ సీపీ నేత

*ఎర్రన్నాయుడు

టీడీపీ నేత

*లాల్‌జాన్‌ బాషా

టీడీపీ నేత

*కోమటిరెడ్డి ప్రతీక్‌ రెడ్డి

(s/o కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి)

*కోటా వెంకట ప్రసాద్‌

(s/o కోటా శ్రీనివాసరావు)

*పి.పవన్‌ కుమార్‌

(s/o బాబూమోహన్‌)

*మహ్మద్‌ అయాజుద్దీన్‌

(s/o మహ్మద్‌ అజారుద్దీన్‌)

ఇపుడు....

*నందమూరి జానకిరామ్‌..

(s/o నందమూరి హరికృష్ణ)

వీరంతా రోడ్డుప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన రాజకీయ, సినీప్రముఖులు.




*వైఎస్ఆర్ సీపీ  నాయకురాలు  శోభా నాగిరెడ్డి  రోడ్డు ప్రమాదంలోనే మృత్యువాత పడ్డారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన ఆ దుర్ఘటన ఇప్పటికీ కళ్లముందు కదులుతూనే ఉంటుంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఎన్నికల ప్రచారం ముగించుకొని కారులో ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పల్ని తప్పించే ప్రయత్నంలో జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు.



*ఇక రోడ్డు ప్రమాదాలు తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం మిగిల్చాయి. సీనియర్ నేతలు ఎర్రన్నాయుడు, లాల్‌ జాన్‌బాషాలు రోడ్డు ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి వద్ద ఎర్రన్నాయుడు ప్రయాణిస్తున్న వాహనం పెట్రోల్‌ ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో ఆయన కన్నుమూశారు. ఇక టీడీపీ ఉపాధ్యక్షుడు లాల్‌జాన్‌ బాషా వాహనం ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఘటనా స్థలిలోనే బాషా కన్నుమూశారు.



*అలాగే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్‌ రెడ్డిని రోడ్డు ప్రమాదమే పొట్టనపెట్టుకుంది.  2011లో  మెదక్‌ జిల్లా కొల్లూరు సమీపంలో జరిగిన  కారు ప్రమాదంలో ప్రతీక్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు ఘటనాస్థలంలోనే చనిపోయారు.  గంటకు 120 కిలోమీటర్ల వేగంతో  కారు నడపడం ఆ ప్రమాదానికి కారణం.



*ఇక ఫాదర్స్‌ డే నాడే.. సినీ నటుడు కోట శ్రీనివాసరావుకు పుత్రశోకం కలిగింది. ఫంక్షన్‌కు అటెండయ్యేందుకు స్పోర్ట్స్‌ బైక్‌ మీద వెళ్తున్న కోట వెంకట ప్రసాద్‌.. నార్సింగి సమీపంలో అప్పా వద్ద డీసీఎం వ్యాన్‌ ఢీకొట్టడంతో మృత్యువాత పడ్డారు. బాబూమోహన్‌ కుమారుడు పవన్‌ కుమార్‌ 2003లో జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పాయాడు. అలాగే వర్ధమాన నటుడు యశోసాగర్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి మృత్యువాత పడిన విషయం తెలిసిందే.



*హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో  మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ కుమారుడు అయాజుద్దీన్‌ కన్నుమూశాడు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మితి మీరిన వేగంతో బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని అప్పట్లో వాదనలు వినిపించాయి.



*ఇపుడు నందమూరి హరికృష్ణ కుమారుడు నందమూరి జానకిరామ్‌ను బలిగొంది రోడ్డుప్రమాదమే. జానకిరామ్‌ ప్రయాణిస్తున్న సఫారీ.. నల్లగొండ జిల్లా ఆకుపాముల శివారు వద్ద రాంగ్‌రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది. చెప్పుకుంటూ పోతే  ఎంతో మంది జీవితాల్లో రోడ్డు ప్రమాదాలు విషాదం నింపాయి.



చిన్న అజాగ్రత్తలు ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. ప్రమాదాలకు కారణాలు ఏంటని ఆరా తీస్తే...అతివేగం ఒకరిదైతే.. నిర్లక్ష్యం ఇంకొకరిది.  ప్రొఫెషనల్‌ డ్రైవర్లు కాకపోవటం.... డ్రైవర్లను పెట్టుకోకపోవటం...ఇలా ఎన్నో ప్రమాదానికి కారణాలవుతున్నాయి. ఇక అన్నిజాగ్రత్తలు తీసుకున్నా...రోడ్డుపై వెళ్లేటపుడు ఎదురుగా వస్తున్న వాహనదారుల తప్పిదాల వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top