మరి కొద్ది క్షణాల్లో పెళ్లి.. అంతలోనే..

మరి కొద్ది క్షణాల్లో పెళ్లి.. అంతలోనే..


► పెళ్లి కుమారుడు కుటుంబ సభ్యులతో తగాదాకు దిగిన కుల పెద్దలు

►పోలీసులు నచ్చజెప్పిన ఫలితం శూన్యం

 ►రోలు వద్ద జరిగిన  వివాహం

► టెక్కలి గొల్లవీధిలో ఘటన




టెక్కలి(శ్రీకాకుళం): డివిజన్‌ కేంద్రమైన టెక్కలి గొల్లవీధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఓ వివాహ వేడుకలో కొంతమంది కుల పెద్దలు తగాదాకు దిగడంతో పెళ్లి వేడుక వివాదాస్పదంగా మారింది. పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లికి వచ్చిన వారంతా ఇబ్బందులు పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు గొల్లవీధికి చెందిన యువకునికి, విశాఖపట్నానికి చెందిన యువతితో వివాహాం చేసేందుకు కుటుంబ సభ్యులు ముహూర్తం నిర్ణయించుకున్నారు.



ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున ముహూర్తం కావడంతో మరి కొద్ది క్షణాల్లో మూడు ముళ్లు పడతాయనుకునే సమయంలో అదే వీధికి చెందిన కొంతమంది కుల పెద్దలు మండపం వద్దకు వచ్చి పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులతో తగాదాకు దిగారు. పాత కుటుంబ కలహాలు నేపథ్యంలో వివాహం జరుగుతున్న చోట రచ్చ రచ్చ చేశారు. తగాదా తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం అందజేశారు.



స్థానిక పోలీసులు పెళ్లి మండపం వద్దకు చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే ఆదివారం ఉదయం అంతా ఎటువంటి తగాదా లేకుండా సరిగ్గా ముహూర్తం సమయానికే కొంతమంది కుల పెద్దలు తగాదాకు దిగడంపై అసలు కారణాలు తెలియకపోవడంతో అంతా బిత్తరపోయారు. తగాదా ఎప్పటికీ సద్దుమణగకపోవడంతో నవ దంపతులను మరో చోటకు తీసుకువెళ్లి రోలు సమక్షంలో వివాహం చేసినట్టు తెలిసింది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top