అవినీతికి కాపుకాస్తున్న బాబు


  నేరారోపణలు ఉన్నవారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు?

  మహానేత వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి

  వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల.వీరభద్రస్వామి


 

 విజయనగరం మున్సిపాలిటీ: మచ్చలేని రాజకీయాలు చేస్తున్నామని  గొప్పలు చెప్పుకునే  సీఎం చంద్రబాబు  అవినీతి రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల.వీరభద్రస్వామి ఆరోపించారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడారు. ఓటుకు కోట్ల వ్యవహారం ఇందుకు ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఈ వ్యవహారంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులను సస్పెండ్ చేయకపోవడం దారుణమన్నారు.  ఓటుకు  కోట్లు వ్యవహారంలో  చంద్రబాబు పాత్ర కూడా ఉందని కోలగట్ల ఆరోపించారు.

 

 ఒక వేళ తాను నిర్దోషినని చంద్రబాబు భావిస్తే, పదవికి రాజీనామా చేసి, విచారణ జరిపించుకోవాలన్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన రూ.కోట్లు దుర్వినియోగమవుతున్నాయన్నారు. హడావిడిగా, నాణ్యత లేకుండా పనులు చేస్తున్నారన్నారు.  ఘనంగా మహానేత వైఎస్ జయంతి వేడుకలు: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించాలని కోలగట్ల పిలుపునిచ్చారు. బుధవారం నిర్వహించే వేడుకల్లో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top