సంపూర్ణం

సంపూర్ణం - Sakshi


♦ వైఎస్సార్‌సీపీ పిలుపుతో కదిలిన ప్రజలు

♦ మద్దతుగా నిలిచిన సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్)

♦ స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపారులు, విద్యాసంస్థలు

♦ రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు... డిపోలకే పరిమితం

♦ నేతలను అరెస్టు చేయడంలో ఉత్సాహం చూపిన పోలీసులు

♦ ఎస్కేయూలో బంద్ పాటించిన అధ్యాపకులు, విద్యార్థులు

 

 సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘ప్రత్యేకహోదా’ డిమాండ్ లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణంగా సాగింది. సీపీఎం, సీపీఐతో పాటు ఆ పార్టీల అనుబంధ సంఘాలు కూడా బంద్‌లో పాల్గొన్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం దాకా సాగిన బంద్‌లో విద్యాసంస్థలు, వ్యాపారులతో పాటు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా రోడ్లపై ఎక్కడా ఆర్టీసీ బస్సు కనిపించలేదు. అన్ని ప్రాంతాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. తర్వాత సొంతపూచీకత్తుపై సాయంత్రం విడుదల చేశారు.



 అనంతపురంలో వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు గురునాథరెడ్డి, చవ్వారాజశేఖరరెడ్డి, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు రాంభూపాల్‌రెడ్డి, జగదీశ్ ఆధ్వర్యంలో తె ల్లవారుజామున 5గంటల నుంచే నగరంలో బంద్ చేపట్టారు. ఉదయం 6.45 గంటలకు ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. కొద్ది సేపటికే పోలీసులు వీరందరినీ అరెస్టు చేసి త్రీటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నదీమ్, రంగంపేట గోపాల్‌రెడ్డి ఉన్నారు. పార్టీక్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో టవర్‌క్లాక్ వద్ద ర్యాలీ చేపట్టగా పోలీసులు అరెస్టులు చేశారు.



జిల్లా పరిషత్‌లో ఆందోళన చేస్తున్న మీసాల రంగన్న, ఆలమూరు శ్రీనివాసరెడ్డిని సైతం అరెస్టు చేశారు. తర్వాత మహిళావిభాగం అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. విద్యార్థి విభాగం నాయకుడు బండి పరశురాంను సంగమేశ్వరనగర్‌లో అరెస్టు చేశారు. సీఐటీయూ రాష్ట్రనేత ఓబుళు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, సీఐటీయూ నేత జాఫర్, ఏఐవైఎఫ్ నేత రమణ, లింగమయ్యలను అరెస్టు చేశారు. 11 గంటలకే అందరినీ అరెస్టు చేశారు. రుద్రంపేట బైపాస్‌లో బైక్‌ర్యాలీ చేపట్టిన పార్టీ యువజనవిభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజీవ్‌రెడ్డిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల ఎంతమందిని అడ్డుకున్నా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సాయంత్రం 5గంటల వరకూ బంద్ చేపట్టి ‘ప్రత్యేకహోదా’ ఆకాంక్షను స్పష్టం చేశారు.



 ఉరవకొండ: ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. సీపీఐ, సీపీఎం, రైతుసంఘం, ఎవ్మూర్పీఎస్, విద్యార్ది సంఘాలు బంద్‌లో పాల్గొని విజయువంతం చేశాయి. వ్యాపారస్దులు స్వచ్చందంగా వుద్దతు పలికారు. అనంతపురం -బళ్ళారి బైపాస్‌ను దిగ్భందించారు. బంద్ సందర్భంగా చేపట్టిన ధర్నాలో విశ్వ ప్రసంగిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.  



 కదిరి : ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలిలో రోడ్డుపై వంటావార్పు చేశారు. బంద్‌లో ఎంపీ మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రశాంతంగా బంద్ చేస్తున్న పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌లో వైసీపీ సీఈసీ సభ్యులు డా.పీసీ సిద్దారెడ్డి, మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి, సీపీఐ నాయకులు వే మయ్యయాదవ్, సీపీఎం నాయకులు నరసింహులు, సుబ్బిరెడ్డి పాల్గొన్నారు.



 ధర్మవరం: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ విజయవంతంగా సాగింది. కేతిరెడ్డి నివాసం నుంచి భారీ ర్యాలీ మొదలవ్వగానే పోలీసులు అడ్డుకుని హౌస్ అరె స్టు చేశారు. అయినా ఆయన పార్టీ నేతలతో కలిసి బయటకు వచ్చారు. పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వాలనే నినాదాలతో ధర్మవరం హోరెత్తింది. కళాజ్యోతి సర్కిల్‌లోకి రాగానే ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్ కేతిరెడ్డిని అరెస్ట్ చేశారు. పెనుకొండలో జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ర్యాలీ చేపట్టగానే శంకర్‌నారాయణను పోలీసులు అరెస్టు చేశారు.



బంద్‌లో పాల్గొన్న సీపీఐ, సీపీఎం నేతల కూడా అరెస్టు చేశారు. కళ్యాణదుర్గంలో పార్టీ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. ధర్నాలో రాష్ట్ర కార్యదర్శులు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, తిప్పేస్వామి పాల్గొన్నారు. మధ్యాహ్నం పార్టీ శ్రేణులను పోలీసుల అరెస్టు చేశారు. మడకశిరలో పార్టీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. మాజీ మంత్రి నర్సేగౌడ్, రాష్ట్రకార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి రవిశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. అందరినీ పోలీసులు అరెస్టు చేశారు. విద్యాసంస్థలు, వ్యాపారసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సంపూర్ణంగా బంద్ సాగింది.



సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎంఐఎం నేతలు పాల్గొన్నారు. బంద్‌లో కిసాన్ సెల్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి పాల్గొన్నారు. కొందరు యువకులు వాటర్‌ట్యాంకు ఎక్కి నినాదాలు చేశారు. వీరిని పోలీసులు కిందకు దించి అరెస్టు చేశారు. శింగనమలో కోఆర్డినేటర్ ఆలూరి సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో మరువకొమ్మ  క్రాస్ వద్ద బంద్ చేపట్టారు. శింగనమలలో చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. అడుగడుగునా పోలీసులు అటంకం కల్పించారు. తాడిపత్రిలో ఆదనపు సమన్వయకర్త రమేష్‌రెడ్డి, జిల్లా ప్రధాన  కార్యదర్శి వి.ఆర్.వెంకటేశ్వరరెడ్డి ర్యాలీలు నిర్వహించారు.



అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, దుకాణాలు, బ్యాంకులను మూయించారు. బంద్‌కు సి.పి.ఐ., సి.పి.ఎం. నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. రాప్తాడులో వైఎస్సార్‌సీపీ జీడ్పీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. 44వ జాతీయ రహదారిపై రెండు గంటల పాటు రాస్తారోకో చేశారు. హిందూపురంలో సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4గంటల నుంచే బంద్ చేయించారు. గుంతకల్లులో వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించి బంద్ చేయించారు. హెచ్‌పీసీ, ఐఓసీ డీపోలకు సంబంధించిన 150 ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి.  తర్వాత గుత్తి, పామిడి బంద్‌లో పాల్గొన్నారు. పుట్టపర్తిలో శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ జరిగింది. బస్టాండ్ ఎదుట ధర్నా చేస్తున్న వైఎస్సార్‌సీపీ, వామపక్షపార్టీల నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

 

 పోలీసులతో ఉద్యమాలను ఆపలేరు

  రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమాలు

 - ఓబుళు, సీపీఎం రాష్ట్ర నాయకులు



 రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ఉద్యమాలు ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో.. ఏ పార్టీ కోసమో కాదు. ప్రజాశ్రేయస్సు కోసం చేస్తున్నవి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను వంచించి మోసం చేశారు. తన చేతగాని తనం వల్లే రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి ఉద్యమాలను పోలీసులతో ఆపాలని చూస్తే ఆగవు

 

 సంఘ విద్రోహ శక్తులమా?

 - బి.గురునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే

 మనందరి భవిష్యత్ బాగుండాలని బంద్ చేస్తున్నాం. ఇది పోలీసులకూ వర్తిస్తుంది. మీ పిల్లలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఈ విషయాన్ని మరవద్దు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని మా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య బద్దంగా బంద్ చేస్తున్నాం. మేమేమైనా సంఘ విద్రోహ శక్తులమా?

 

 ఈ ప్రభుత్వాలకు పతనం తప్పదు

 - రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి

 ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వాలకు పతనం తప్పదు. పదవులు అనుభవించడానికే ఎన్నికల ముందు అపద్దపు హామీలు ఇచ్చారు. విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను ఎందుకు అమలు చేయరు? వాటిని అమలు చేయమని అడిగితే పోలీసులతో అరెస్టు చేయిస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం.  

 

 మోసపూరిత ప్రభుత్వాలు

 - డి.జగదీష్, సీపీఐ జిల్లా కార్యదర్శి

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత ప్రభుత్వాలు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒక మాట మాట్లాడుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. ఈ ముఖ్యమంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రత్యేక హోదా కోసం పోరాడాలి. లేదంటే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top