ఒంగోలులో దారుణం


ఒంగోలు క్రైం : ఓ కొడుకు తన తండ్రి పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించాడు. ఇల్లు ఖాళీ చేయలేదని కాళ్లతో తన్ని మరీ చంపాడు. ఈ ఉదంతం నగరంలోని రామ్‌నగర్ 4వ లై న్‌లో మంగళవారం వెలుగు చూసింది. వివరాలు.. ఒంగోలు రూరల్ మండలం చెరువుకొమ్ముపాలేనికి చెందిన బ్రహ్మానందం(64) కుటుంబం కొన్నేళ్ల క్రితం ఒంగోలులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది.



సొంత ఇంట్లో కింద పోర్షన్‌లో కుమారుడు నాగబ్రహ్మాచారి కుటుంబం నివాసం ఉంటుండగా పైఅంతస్తులో ఆయన తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. అర్ధరాత్రి నాగబ్రహ్మాచారి తన తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నాడు. తక్షణమే పైఅంతస్తు ఖాళీ చేసి బయటకు వెళ్తే దాన్ని అద్దెకు ఇచ్చి డబ్బులు తీసుకుంటానని తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. అడ్డొచ్చిన తల్లి రత్తమ్మను చావబాదాడు.



 అనంతరం తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కిందపడేసి పిడి గుద్దులు గుద్దాడు. గొంతు పట్టుకొని నులిమాడు. తేరుకుని పైకి లేచిన తండ్రిని కాళ్లతో తన్నడంతో కిందపడిన బ్రహ్మానందం అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం తెలుసుకున్న ఒంగోలు వన్‌టౌన్, టూటౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడు బ్రహ్మానందం ఇంటికెళ్లి ఆయన భార్య రత్తమ్మ నుంచి వివరాలు సేకరించారు. బ్రహ్మానందం కుటుంబం ఆచారం ప్రకారం మృతదేహాన్ని గోడకు ఆనించి కూర్చోబెట్టారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top