బావాబామ్మర్దుల మధ్య భూ వివాదం.. తుపాకీ కాల్పులు


తోటపల్లిగూడూరు(శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా): వరసకు బావామరుదులు.. చిన్నపాటి భూవివాదంలో ఘర్షణ పడ్డారు. అది కాల్పుల దాకా వెళ్లింది. పోలీసులు, బాధితుని కథనం మేరకు.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం సౌత్ ఆములూరుకు చెందిన వేముల చలపతి, అదే గ్రామానికి చెందిన రంగినేని కిరణ్‌ల మధ్య కోడూరు పంచాయతీ పీడీకండ్రిగలోని నాలుగెకరాల భూమికి సంబంధించి వివాదం కోర్టులో నడుస్తోంది. చలపతి భార్య నీలమ్మకు స్వయానా సోదరుని కుమారుడే కిరణ్. వేముల చలపతి కుమారుడు రూప్‌కుమార్ బుధవారం పీడీ కండ్రిగలోని తమ పొలానికి వచ్చాడు.



అదే సమయంలో ఆ పొలాల మీదుగా రంగినేని కిరణ్ రాగా రూప్‌కుమార్ అడ్డగించాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో రూప్‌కుమార్ తన వద్దనున్న రివాల్వర్‌ను బయటకు తీసి కిరణ్‌ను బెదిరించాడు. కిరణ్ వెనక్కు తగ్గకపోవడంతో రూప్‌కుమార్ కాల్పులకు తెగబడ్డాడు. ఈ క్రమంలో ఒక బుల్లెట్ కిరణ్ ఎడమ మోచేతిలో దిగగా రెండో బుల్లెట్ గురితప్పింది. పక్క పొలంలో ఉన్న కిరణ్ బంధువు వెంకటనారాయణ అక్కడికి రావటంతో రూప్‌కుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. బుల్లెట్ చేతికి తగలడంతో కిరణ్‌కు ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top