నవ వధువు అదృశ్యం
అనంతపురం (క్రైం) : అనంతపురం జిల్లా లో నవ వధువు అదృశ్యం కలకలం రేపుతోంది. వివరాలు...స్థానిక మున్నానగర్కు చెందిన లేట్ కుళ్లాయప్ప కుమార్తె కవిత అలియాస్ కుసుమకుమారిని యల్లనూరు మండలం కూచివారిపల్లికి చెందిన ఎం. బాలశివయ్యకు గతనెల ఫిబ్రవరి 11న వివాహం చేశారు. పెద్దల కుదిర్చిన వివాహం కావడంతో వైభవంగా జరిగింది.
ఈ క్రమంలో కూతురు, అల్లుడు మున్నానగర్లోని అత్త ఇంట్లో ఉంటున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో చీరల పాల్స్ కుట్టించుకుని వస్తానంటూ కవిత తన స్కూటీపై వెళ్లింది. ఎంతసేపటికి ఆమె తిరిగి రాలేదు. దీంతో కంగారుపడ్డ భర్త బాలశివయ్య, ఆమె తల్లి సరోజమ్మ తెలిసిన వారు, బంధువులను ఆరా తీశారు. అయినా లాభం లేకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఏఎస్ఐ సాయినాథ్ ప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా కవిత నగరంలోని చైతన్య స్కూల్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తోంది. అమె అదృశ్యంపై పలు అనుమానాలు తావిస్తున్నాయి. దీంతో ఆమెను ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా? లేక ప్రలోభాలకు గురి చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.