పోలీసుల అదుపులో బ్రాంచ్ పోస్టుమాస్టర్


వరికుంటపాడు (ఉదయగిరి): మండలంలోని గువ్వాడి బ్రాంచ్ పోస్టుమాస్టర్ ఆవుల బాలయ్య వైఎస్సార్   జిల్లా పోలీసుల అదుపులో ఉన్నట్లుగా సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఈయనకు సంబంధం ఉండటంతో పోలీసులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు తూర్పుచెన్నంపల్లికి చెందిన ఆయన సమీప బంధువు మరొకరు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. వీరికి గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ముఠా సభ్యులతో సంబంధం ఉండి అడపాదడపా వారికి ఎర్రచందనం దుంగలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.



వీరితో సంబంధం ఉన్న ఎర్ర దొంగలు కడప పోలీసులకు చిక్కడంతో వారిచ్చిన సమాచారం మేరకు పక్కా ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బద్వేలుకు చెందిన ఇద్దరు ఎస్సైలు, ఆరుగురు కానిస్టేబుళ్లు ఒక బృందంగా ఏర్పడి వీరితో ఎర్రచందనం కొనుగోలుపై ఒప్పందం చేసుకొని వారితోనే మూడురోజులు కలిసి మెలిసి తిరిగి దుంగలను లోడుచేసిన అనంతరం వాహనంతోసహా అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.



భైరవకోన అడవుల్లో ఎర్రచందనం చెట్లు నరికేందుకు పెద్దిరెడ్డిపల్లికి చెందిన కొంతమంది గిరిజనులను వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ వ్యాపారంతో పూర్తిగా సంబంధమున్న వీరిద్దరినీ బద్వేలు పోలీసులు అదుపులోకి తీసుకొని కూలీలను వది లివేశారు. జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌తో  81 మందికి సంబంధం ఉన్నట్లుగా ఎస్పీ గుర్తించారని సమా చారం.



ఇందులో ఉదయగిరి, దుత్తలూరు, నందిపాడు, సీతారామపురం మండలాలకు చెందిన పలువురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. మరో వారం పదిరోజుల్లో ఈ ప్రాంతంలోని ముఖ్యమైన ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఎర్రచందనం అక్రమ స్మగ్లింగ్‌తో సంబంధమున్న పలువురు వ్యక్తుల గుం డెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top