ప్రజల కోసం పరితపించేదే బీజేపీ ప్రభుత్వం
బోట్క్లబ్ (కాకినాడ) : ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్నది బీజేపీ ప్రభుత్వమేనని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో ఆదివారం రాత్రి నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతిలో కూరుకుపోయిందన్నారు. వారసత్వ రాజకీయాలు కారణంగా పేద ప్రజల సంక్షేమం పూర్తిగా మర్చిపోయారన్నారు.
ప్రస్తుతం సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తి ప్రధాన మంత్రి కావడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అవసరమైన పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను ఆకట్టుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విడదీసి పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలపకుండా రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగిందన్నారు. కేవలం రాజకీయ లబ్ధికోసం ప్రస్తుతం రాజకీయ పార్టీలు మాట్లాడడం దారుణంగా ఉందన్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 10కోట్ల 50లక్షలు సభ్యత్వ నమోదు చేసిన ఏకైక పార్టీ బీజేపీ అన్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు మాట్లాడుతూ నరేంద్రమోదీ మన రాష్ట్రానికి ఎన్నో వరాలు ఇచ్చారన్నారు. 24 గంటలు విద్యుత్ తోపాటు 11 కేంద్ర విద్యాలయాలు మనకు కేటాయించారన్నారు. అనంతరం జగన్నాథపురానికి చెందిన మత్స్యకార నాయకులు మచ్చా గంగాధర్ తనయుడు మచ్చా లోకేష్వర్మ బీజేపీలో చేరారు. ఆయనతోపాటు పలువురు యువకులు బీజేపీలో చేరారు. బీజేపీ నాయకులు వేటుకూరి సూర్యనారాయణరాజు, పూడి తిరుపతి రావు, పైడా కృష్ణమోహన్, ఉంగరాల చినబాబు, కర్రి చిట్టిబాబు, పెద్దిరెడ్డి రవికిరణ్ బండారు భాస్కర్, పైడా భావన ప్రసాద్ పాల్గొన్నారు.