పంద్రాగస్టు వేడుకల్లోనూ పచ్చి అబద్ధాలు

పంద్రాగస్టు వేడుకల్లోనూ పచ్చి అబద్ధాలు - Sakshi


చంద్రబాబుపై మండిపడ్డ భూమన



నంద్యాల: పంద్రాగస్టు వేడుకల్లోనూ సీఎం చంద్రబాబునాయుడు పచ్చి అబద్ధాలు చెప్పారని వైఎస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మూడేళ్ల కిందట ఎన్నికల సందర్భంగా తిరుపతిలోని ఇదే వేదిక మీదగా చేసిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. మంగళవారం ఆయన నంద్యాలలో విలేకరులతో మాట్లాడారు.



కాపులను బీసీల్లో చేరుస్తామని, రైతు రుణాలు మాఫీ చేస్తామని, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని, ఇంటికో ఉద్యోగం లేకుంటే రూ. 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఇప్పుడు అదే తిరుపతి వేదికగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అబద్ధాలు చెప్పారని అన్నారు. చట్టాలను చంద్రబాబు తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. శిల్పా చక్రపాణిరెడ్డి ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవి వదులుకొని రాజీనామాను ఆమోదింపజేసుకున్నారని, కానీ చంద్రబాబు మాత్రం తాను కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం లేదని దుయ్యబట్టారు.



చంద్రబాబు జీవితమంతా మోసమేనని, నీతి, నిజాయితీ గురించి చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు అని భూమన విమర్శించారు. చంద్రబాబు మోసపూరిత మాటలకు నంద్యాల ప్రజలు సమాధి కడుతారని హెచ్చరించారు. చంద్రబాబు మాటలను నమ్మేస్థితిలో ప్రజలు లేరని అన్నారు.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top