భవిష్యత్తుకు రాచబాట

భవిష్యత్తుకు రాచబాట


విశాఖపట్నం : ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ ఎంతో కీలకం. ఇందులో చూపిన ప్రతిభ భవిష్యత్తులో ఉపాధికి ఉపకరిస్తుంది. ఆయా అంశాలపై విద్యార్థులకు ఉన్న పట్టు, పరిశీలనను తెలియజేస్తాయి. నవంబరు నెలాఖరు నుంచి డిసెంబరు, జనవరి మాసాల్లో విద్యార్థులు ఎక్కువగా ప్రాజెక్ట్ వర్కులు చేస్తారు. ఇందుకోసం విద్యార్థులు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా వివిధ ప్రొఫెషనల్ కోర్సుల ఇన్‌స్టిట్యూట్స్‌కు ముఖ్యకూడలిగా ద్వారకానగర్ కేంద్రీకృతంగా మారింది.



ఇక్కడ వృత్తివిద్య, డిప్లొమా, ఉన్నత విద్యకు సంబంధించిన ప్రతిభావంతమైన ప్రయివేట్ ఇన్‌స్టిట్యూట్స్ అధికంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన అనేక మంది ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థులు ఇక్కడి ఇనిస్టిట్యూట్స్‌లో అధికంగా ప్రాజెక్టు వర్క్‌లు చేస్తున్నారు. నగరంలో థియిరీ ప్రాజెక్ట్, పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమల ప్రాక్టికల్ వర్క్‌లు చేయడానికి ఉపక్రమించారు. ఐటీ, ఈసీఈ, ఈఈఈ ఇంజినీరింగ్ విద్యార్థులు నగరలో పేరుగాంచిన శాస్త్ర, సాంకేతిక సంస్థల్లో ప్రాజెక్ట్ వర్కులు ప్రారంభించారు. మరికొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లో ఏంసీఏ, ఎంబీఏ తదితర కోర్సులకు కూడా ప్రాజెక్టు వర్క్‌లు ప్రారంభమయ్యాయి.



అవగాహన కోసమే... ఒక విషయాన్ని ఒకరు చెబితే వినడం కంటే..ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటే పూర్తి అవగాహన వస్తుంది. ఆ విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. అందుకే వృత్తివిద్యా కోర్సుల్లో ప్రాజెక్ట్ వర్క్‌లు కీలకంగా మారాయి. విద్యార్థులు కూడా ప్రెజెంటేషన్‌లోప్రత్యేకత చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంజినీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ తదితర కోర్సులకు సంబంధించిన విద్యార్థులు చివరి ఏడాదిలో ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. విజ్ఞాన సముపార్జనే ప్రధాన ధ్యేయం. కళాశాలల్లో నేర్చుకున్న పాఠ్యాంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించటం కోసం సంస్థలు, కంపెనీలకు విద్యార్థు లు వెళ్తారు. అక్కడ పనితీరు, మార్కెటింగ్ విధానాలు, అమ్మకాలు, కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజా ్ఞనం, ఉత్పత్తుల తీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తారు.



ఒక్కొక్కరిది ఒక్కో శైలి...

ఈ పరిశీలన అనంతరం విద్యార్థులు నివేదికను రూపొందిస్తారు. విద్యార్థి ఆలోచనా తీరు, పరిశీలన, కొత్త విషయాల గ్రహింపు, అనుమానాలు అన్నీ ఇందులో ఉంటాయి. తద్వారా విద్యార్థుల ఆలోచననా శైలి తెలియడంతోపాటు వారిని ఏ అంశంలో మెరుగుపర్చాలో అధ్యాపకులకు తెలుస్తుంది. వారు పరిశీలించిన కంపెనీల నిర్వహణలో తీసుకోవాల్సిన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సిన తీరుపైనా విద్యార్థులు సూచనలు చేయవచ్చు. కాలానుగుణంగా పరిశ్రమల్లో చేపట్టాల్సిన మార్పులపై విద్యార్థులకు అవగాహన రావటానికి ప్రాజెక్టు వర్కు ఉపకరిస్తుందని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఎన్.వి. రవికుమార్ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top