బల్లకింద చేతులకు బేడీలు !

బల్లకింద చేతులకు బేడీలు ! - Sakshi


అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైళ్లు పరుగెట్టిస్తోంది. జిల్లాలో వరస దాడులతో బెంబేలెత్తిస్తోంది. చైతన్యవంతులైన ప్రజలు ఏసీబీని ఆశ్రయించడం ఆ శాఖకు కలిసివచ్చే అంశంగా మారింది. అందిన ప్రతి ఫిర్యాదునూ వినియోగించుకుంటూ అవినీతి అధికారుల భరతం పడుతోంది. స్థాయి భేదం లేకుండా బల్ల కింద చేతులకు బేడీలు వేయిస్తోంది.

 

 సాక్షి, గుంటూరు :

 జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పుడు ఏసీబీ మాట వింటేనే వణికి పోతున్నాయి. అవినీతి అధికారులను వరసగా వలపన్ని పట్టుకుంటున్న ఏసీబీపై ప్రజల్లో విశ్వాసాసం పెరిగింది. గతంలో గ్రామ స్థాయి అధికారులు మినహా ఉన్నతాధికారులు ఏసీబీకి చిక్కినట్టు తెలిసేకాదు. అయితే ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. అవినీతికి పాల్పడుతున్న ఎంతటివారినైనా ఏసీబీ వదిలిపెట్టడం లేదు. లంచం డిమాండ్ చేస్తున్నారని తెలియగానే పక్కా వ్యూహం పన్ని దాడి చేసి అరెస్టు చేస్తోంది.



     జిల్లాలో ఈ ఏడాది మొదట్లో నరసరావుపేట డివిజనల్ సహకార శాఖ అధికారి రామారావును ఏసీ బీ అధికారులు  పట్టుకున్నారు.



     అనంతరం గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకటరమణను వలపన్ని పట్టుకున్నారు.

     ఇక అక్కడ నుంచి జిల్లా స్థాయిలో అవినీతికి పాల్పడే అధికారుల పనిపట్టడంలో నిమగ్నమయ్యారు.

     ఐజీ కార్యాల మేనేజర్ శంకర ప్రసా ద్, దుర్గి ఎస్‌ఐ వెంకటకృష్ణలను పట్టుకుని కటకటాల వెనక్కి పంపారు.

     ఇటీవల లక్ష రూపాయల లంచం తీసుకుంటున్న సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డెరైక్టర్ హనుమంతు నాయక్‌ను పట్టుకున్నారు.




     తాజాగా మైనింగ్ శాఖలో గుంటూ రు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల డిప్యూటీ డెరైక్టర్ వై.ఎన్.ఆర్.వి.ప్రసాద్ రూ. 80 వేలు లంచం తీసుకుని డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు ఇవ్వగా దాడిచేసి డబ్బుతో సహా ఇద్దరినీ అరెస్ట్ చేశారు.



     ఇలా వరసగా జిల్లాస్థాయి అధికారులు ఏసీబీ వలలో చిక్కుతుండటంతో అన్ని శాఖల్లోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

 గతానికి భిన్నంగా...



     గతంలో ఏసీబీ అధికారులు ఏడాదికి జిల్లాలో నలుగురు లేదా ఐదుగురు అవినీతి అధికారులను మించి పట్టుకోలేకపోయేవారు.

     అప్పట్లో ఏసీబీ కార్యాలయం జిల్లాలో ఉండేది కాదు. బాధితులు ఏసీబీని ఆశ్రయించాలంటే కృష్ణా జిల్లా విజయవాడ వెళ్లాల్సి వచ్చేది.

     ఏసీబీలోని కొందరు కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఏ అధికారిపై ఎవరు ఫిర్యాదు చే శారనే విషయాన్ని లీక్ చేస్తుండడం వల్ల దాడులకు అవకాశం ఉండేది కాదనే ఆరోపణలు అప్పట్లో ఉండేవి.

     దీనికితోడు విద్యావంతులు తప్ప అసలు ఏసీబీ అధికారులంటే ఎవ రు, వారిని ఎలా కలవాలి అనే విషయాలపై ప్రజల్లో అవగాహన ఉండేది కాదు.



     ఆరు నెలల కిందట గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో ఏసీబీ కార్యాల యాన్ని ఏర్పాటు చేసి ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలతోపాటు సిబ్బందిని నియమించడంతో జిల్లా ప్రజలకు ఏసీబీ అధికారులు అందుబాటులో వచ్చినట్టయింది. అంతేకాక ప్రజల్లో చైతన్యం పెరిగింది.

 పక్కా పథకం ప్రకారం దాడులు ..



     వివిధ పనులపై ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్న ప్రజలను డబ్బు కోసం వేధిస్తున్న ఉద్యోగులపై ఏసీబీ అధికారులు నిఘా ఉంచుతున్నారు.

     బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించగానే తమ వద్ద నుంచి అధికారికి ఫోన్ చేయించి ఆ అధికారి మాటలు రికార్డు చేయడం, లేదా బాధితుడిని నేరుగా పంపి డబ్బు ప్రస్తావన తీసుకువచ్చి నిర్ధారించుకుంటున్నారు.

     ఆ తరువాత వ్యూహం పన్ని దాడి చేస్తున్నారు. దాడుల సమయంలో అధికారులు పారిపోవాలని ప్రయత్నించినా, డబ్బు ఎక్కడ పెట్టారో చెప్పకపోయినా తమదైన శైలిలో విచారించి అరెస్ట్ చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top