‘బాబు నవ్వు’పై మండలిలో చర్చ
బడ్జెట్పై చర్చను ప్రారంభించిన ఎమ్మెల్సీ చెంగల్రాయుడు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవ్వుపై శుక్రవారం శాసన మండలి సమావేశాల్లో కొద్దిసేపు ఆసక్తికర చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు మండలిలో బడ్జెట్ చర్చను ప్రారంభించారు. ఆయన తన ప్రసంగంలో చంద్రబాబు నవ్వు అంశాన్ని ప్రస్తావించారు. ‘‘చంద్రబాబు గతంలో తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడూ నవ్వేవారు కాదు. ఇప్పుడు మాత్రం ఆయన ఎక్కడ కనిపించినా నవ్వుతూనే ఉంటున్నారు’’ అని అన్నారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు మూకుమ్మడిగా కల్పించుకొని ‘‘నవ్వినా తప్పుపడతారా’’ అని ఎదురు ప్రశ్నించారు. దీనికి చెంగల్రాయుడు స్పందిస్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఎప్పుడూ నవ్వుతూ ఉండటం చూసి ప్రజలు వారి సమస్యలన్నీ తీరుతాయని ఆశపడుతున్నారని చురకేశారు.