బందరులోవిద్యుత్ షార్ట్ సర్క్యూట్
-
బందరులోవిద్యుత్ షార్ట్ సర్క్యూట్ -
కాలిబూడిదైన ఇల్లు
కోనేరుసెంటర్(మచిలీపట్నం) : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ వృద్ధురాలు సజీవదహనమైంది. కదల్లేని స్థితిలో ఉన్న ఆమె.. క్షణాలో ్లచుట్టుముట్టిన అగ్నికీలలకు ఆహుతైంది. ఈ దుర్ఘటన మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని భాస్కరపురంలో చోటుచేసు కుంది. భాస్కరపురంలోని దిమ్మెల సెంటర్లో శీలం తిరుపతమ్మ(80) అనే వృద్ధురాలు నివస్తుంది. ఆమె ఇటీవల రోడ్డుపై నడస్తూ కాలుజారి పడిపోయింది. అప్పటి నుంచి కదల్లేని స్థితిలో ఇంట్లోనే ఉంటుంది. పక్కనే ఉన్న కుమారులు ఆమె ఆలనాపాలనా చూస్తుంటారు.
మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తిరుపతమ్మ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. కదల్లేని స్థితిలో ఉన్న తిరుపతమ్మ సజీవదహనమైంది. అదే సమయంలో సమీపంలో నివసిస్తున్న ఆమె మనమడు శీలం ఏడు కొండలు ఇంట్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. అతను బయటకు వచ్చి చూడగా తిరుపతమ్మ ఇంటిపై మంటలు వ్యాపించి ఉన్నాయి. వెంటనే స్థానికుల సాయంతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. అప్పటికే తిరుపతమ్మ కాలిపోయింది. మచిలీపట్నం ఎస్ఐ శ్రీహరిబాబు ఘటనాస్థలాన్ని పరిశీలించి తిరుపతమ్మ బంధువుల నుంచి వివరాలు సేకరించారు. బుధవారం ఉదయం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి కుమారుడు శీలం బాబూరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీహరిబాబు తెలిపారు.
వివరాలు సేకరించిన రెవెన్యూ అధికారులు
బందరు ఆర్డీవో పి.సాయిబాబు, తహశీల్దార్ బి.నారదముని, ఆర్ఐ శివశంకర్, వీఆర్వో మధు తదితరులు బుధవారం ఉదయం సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై తిరుపతమ్మ కుటుంబ సభ్యులను అడిగి ఆర్డీవో సాయిబాబు వివరాలు సేకరించారు. అగ్ని ప్రమాదం గురించి ఉన్నతాధికారులకు తెలియజేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబానికి తహశీల్దార్ నారదముని రూ.5వేలను మట్టి ఖర్చుల నిమిత్తం అందజేశారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి వెంకటబాబా ప్రసాద్, కౌన్సిలర్లు కొట్టె అంకవెంకట్రావు, గూడవల్లి నాగరాజు, మాజీ కౌన్సిలర్ కొల్లు రమేష్ తదితరులు కూడా తిరుపతమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.