శ్మశానానికి దారేది?


  • మృతదేహంతో రోడ్డుపై బంధువుల బైఠాయింపు

  •  నిలిచిన ట్రాఫిక్ : ఆర్‌ఐ, వీఆర్‌వో జోక్యంతో తరలింపు

  • గర్నికం (రావికమతం) : గర్నికం గ్రా మంలో రెండు పార్టీల నాయకుల వివా దం కారణంగా శ్మశానానికి వెళ్లేదారి మూసుకుపోయింది. రెండు నెలలైనా అధికారులెవరూ పట్టించుకోకపోవడం తో ఆ గ్రామంలో ఎవరు మృతిచెందినా శ్మశాన వాటికకు తీసుకెళ్లలేకపోతున్నారు. బుధవారం నవర రాజు మృతిచెందగా మృతదేహాన్ని తీసుకువెళ్లే దారిలేక, మరోదారి లోంచి వెళ్లనీయకపోవడంతో మృతుని బం ధువులు ఆగ్రహించారు. మృతదేహాన్ని బీఎన్‌రోడ్డుపై ఉంచి బైఠాయించారు.



    సుమారు రెండుగంటల వరకూ అలాగే ఉండిపోవడంతో ఆ రహదారిలో అటూ ఇటూ రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ గ్రామంలో విశ్వ బ్రాహ్మణులు, మేదర్లు, ఎస్సీ కుటుంబీకులకు కోమటి చెరువు శ్మశాన వాటికగా ఉంది. అక్కడికి వెళ్లే రహదారిని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రెండునెలల క్రితం అభివృద్ధి చేసేందుకు సర్పంచ్ వర్గీయులు పనులు చేపట్టారు. అయితే తమ భూములు పోతున్నాయంటూ టీడీపీ వర్గీయులు ఆ పనులను అడ్డుకున్నారు.



    నేటికి రెండునెలలైనా ఎవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో బుధవారం రాజు మృతదేహాన్ని తీసుకువెళ్లే వీలు లేకపోవడంతో వివాదం చోటుచేసుకుంది. చివరకు ఆర్‌ఐ గంగరాజు, వీఆర్‌వో ముత్యాలు అక్కడికి చేరుకుని గ్రామానికి చెందిన రాము అనే మహిళను ఒప్పించి వారి స్థలం మీదుగా ఆ మృతదేహాన్ని రుద్రభూమికి తీసుకువెళ్లారు. ఇప్పటికైనా తహశీల్ధార్ స్పందించి రహదారి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top