కృష్ణా వివాదంపై న్యాయ సలహా కోరిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చురేపుతున్న కృష్ణా నదీ జలాల వివాదంలో ఇంతవరకూ మౌనం దాల్చిన కేంద్రం ఇప్పుడు తన మౌనవ్రతాన్ని వీడింది. ఈ వివాద పరిష్కారంలో తమ పరిధి ఏమిటో తెలపాలంటూ స్వయంగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు విన్నవించిన నేపథ్యంలో కేంద్రంలో కదలిక వచ్చింది.
బోర్డు పరిధి ఎంత మేరకు, బచావత్ ట్రిబ్యునల్ అవార్డులోని క్లాజ్-15 ఏం చెబుతోంది, బోర్డు పరిష్కారం చూపనప్పుడు కేంద్రం జోక్యం ఎలా ఉండాలన్న దానిపై కేంద్ర జల వనరుల శాఖ తాజాగా న్యాయ శాఖ సలహా కోరింది. దీనిపై కేంద్ర న్యాయ శాఖ ఒకట్రెండు రోజుల్లో తన అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఉందని నీటి పారుద ల శాఖ వర్గాలు వెల్లడించాయి.
న్యాయ శాఖ అభిప్రాయం మేరకే పంచాయితీని చక్కబెట్టేందుకు ప్రత్యేక ప్రతినిధిని రాష్ట్రానికి పంపే విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లేదంటే తిరిగి బోర్డుకే పరిష్కార బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉంది. అయితే కేంద్రం ప్రతినిధిని పంపని పక్షంలో మరోమారు జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలసి ప్రత్యేక ప్రతినిధిని పంపాలనిగానీ లేక అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనిగానీ టీ సర్కారు భావిస్తోంది.