పార్టీ నేతలకు శిక్షణపై బాబు సమీక్ష


పుష్కరాల ఆరంభంలోగా నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ!

 

 సాక్షి, విజయవాడ బ్యూరో : టీడీపీ నేతలకు శిక్షణపై పార్టీ రాష్ర్ట కార్యాలయ బాధ్యులతో అధినేత చంద్రబాబు బుధవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో చర్చించారు. పార్టీ నేతలు సుమారు 500 మందికి గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని ఓ ప్రైవేటు వర్సిటీ లేదా విజయవాడ నగరంలోని ఫంక్షన్ హాల్‌లో శిక్షణనిచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, నాయకత్వ లక్షణాల పెంపు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై 40 మంది చొప్పున ఉండే ఒక్కో బ్యాచ్‌కు ఐదు రోజుల పాటు శిక్షణ  ఇవ్వనున్నారు. అలాగే ఖాళీగా ఉన్న నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీపై కూడా చర్చించారు. పుష్కరాల ఆరంభంలోగా వీటిని భర్తీ చేసి, శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు సమాచారం.



 సీఎంను కలసిన దర్శకుడు బోయపాటి

 సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు. వచ్చే నెలలో కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గతేడాది గోదావరి పుష్కరాల ప్రారంభ దృశ్యాలను బోయపాటి దర్శకత్వంలో చిత్రీకరించిన విషయం తెలిసిందే. అలాగే ఈసారి కూడా కృష్ణా పుష్కరాల సందర్భంగా నది అలంకరణతో పాటు ప్రారంభ దృశ్యాలను చిత్రీకరించడం, మహా హారతి ఎక్కడ్నుంచి ఇస్తే అందరూ వీక్షించేందుకు వీలుగా ఉంటుందో ఆ స్థలాన్ని ఖరారు చేసే బాధ్యత బోయపాటికే అప్పగించినట్లు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top