మోసం చేయడం బాబు నైజం


పులివెందుల : ప్రజలను వంచించడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం స్థానిక బాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలముందు అధికారంలోకి రావడానికి అనేక హామీలను గుప్పించారన్నారు. అధికారంలోకి వచ్చాక వాటిలో ఏ ఒక్క హామీని అమలుపరిచిన పాపానపోలేదన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలపై పోరాటాలు చేస్తున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంత్రులచేత, ఎమ్మెల్యేలచేత బురదచల్లించే ప్రయత్నాలు బాబు చేస్తున్నారన్నారు.   జగన్‌ను విమర్శిస్తున్న టీడీపీ నాయకులు ముందుగా తమ పార్టీ అధినేత  ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని నిలదీయాలన్నారు. వైఎస్‌ఆర్‌సీపీని పోలీసుల సాయంతో అణగదొక్కేందుకు ప్రయత్నాలు చేయండని మంత్రులే పార్టీ నాయకులకు పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు.  

 

 సమస్యల పరిష్కారానికి కృషి.. :

 క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. స్థానిక ఎర్రగుడిపాలెంకు చెందిన రజకులు తమ దోబీఘాట్‌లో షెడ్డు ఏర్పాటు చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించి ఎంపీ నిధుల ద్వారా ఏర్పాటు చేస్తానని హామి ఇచ్చారు. బద్వేలు ఎమ్మెల్యే జయరాములు ఎంపీని కలిసి తన నియోజకవర్గంలోని పలు సమస్యలపై చర్చించారు. నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు కోరగా.. వివిధ కంపెనీల ప్రతినిధులకు సిఫార్సు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చెర్మైన్ చిన్నప్ప, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top