లారీ ఢీకొని అయ్యప్ప భక్తుడి మృతి
భీమడోలు : జాతీయ రహదారి భీమడోలు అయ్యప్పస్వామి గుడి వద్ద శనివారం రాత్రి ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో అయ్యప్పస్వామి మాలధారుడు కేతా బాలాజీ(21)దుర్మరణం చెందాడు. బహిర్భూమికి వెళ్లిన బాలాజీని వేగంగా లారీ ఢీకొట్టిన సంఘటనలో అక్కడిక్కడే మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. పోలసానిపల్లి గ్రామానికి చెందిన కేతా బాలాజీ నెలరోజుల క్రితం అయ్యప్పస్వామి మాల ధరించాడు. అయ్యప్ప స్వాముల కోసం భీమడోలులోని గుడి పక్కనే ఇతని కుటుంబం చిన్న హోటల్ నిర్వహిస్తోంది. శనివారం రాత్రి బాలాజీ డివైడర్ దాటి రోడ్డు మార్జిన్లో బహిర్భూమికి వెళుతుండగా ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వెళుతున్న లారీ ఢీకొంది.
బాలాజీ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతను తాడేపల్లిగూడెం సమీపంలోని వైజ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఆతని మరణవార్త వినగానే గ్రామస్థులు, తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. పదిరోజుల్లో దీక్ష ముగించుకుంటే బాధలు తీరుతాయని ఆశించిన తమకు కడుపు కోతను మిగిల్చాడంటూ తల్లి, తండ్రి శ్రీనివాసరావు, అతని చెల్లెలు కల్యాణిలు రోదించారు. ఢీకొట్టిన లారీని పోలీసులు కైకరం సమీపంలో పట్టుకున్నారు. లారీడ్రైవర్ ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన కాసాని శ్రీనివాసరావుగా గుర్తించారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసును భీమడోలు ఎస్సై బి.వెంకటేశ్వరరావు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.