అత్తింటి వేధింపులపై కోడల ఆగ్రహం

అత్తింటి వేధింపులపై కోడల ఆగ్రహం


 నరసన్నపేట: అత్తింటి వేధింపులపై ఓ కోడలు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. మెట్టింటి ముందు బిడ్డతో సహా ఆందోళనకు దిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. నరసన్నపేట మారుతీనగర్‌కి చెందిన వి.సింహాచలం కుమారుడు మధుసురేష్‌తో చోడవరం గ్రామానికి చెందిన బి.శ్రీనివాసరావు కుమార్తె రామతులసీకు 2013 జూన్‌లో వివాహం జరిగింది. వివాహం తర్వాత అత్తింటి వేధింపులు పెరిగాయని, గర్భం దాల్చి పుట్టింటికి వెళ్లగా అత్తింటి నుంచి స్పందన లేదని రామతులసీ తన అత్త చిట్టిలక్ష్మీ, భర్త సురేష్‌లపై చోడవరం పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సురేష్‌ను అరెస్టు చేశారు.

 

 ఈ వివాదం తర్వాత భార్యాభర్తల మధ్య సయోధ్య కుదరకపోవడంతో మనోవర్తి కోరుతూ రామతులసీ మరో కేసు పెట్టారు. కేసు కొనసాగుతుండగా భర్తతో జీవిద్దామనే భావంతో బుధవారం నరసన్నపేటలోని అత్తవారింటికి బంధువులతో కలసి వచ్చారు. అయితే తమ కుమారుడు లేడని.. వివాదం కూడా కోర్టులో ఉన్న దృష్ట్యా ఇంటిలోకి రావద్దంటూ రామతులసీని అత్తమామలు అంగీకరించలేదు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. రామతులసీ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారొచ్చి ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. కేవలం తాను ఆడ బిడ్డకు జన్మనిచ్చిన కారణంగానే తనను వేధిస్తూ ఇంటికి రాకుండా నెట్టివేశారని రామతులసీ ఆరోపించారు. కాగా.. తనపై రామతులసీ చోడవరం పోలీస్టేషన్‌లో మూడు కేసులు పెట్టారని.. తీర్పు వచ్చే వరకు తానేమి చేయలేనని ఆమె భర్త మధుసురేష్ పోలీసులకు తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top