యధేచ్చగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి
గుంటూరు: వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ యధేచ్చగా దాడులకు పాల్పడుతోంది. పిడుగురాళ్ల పట్టణంలో గురువారం అర్దరాత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. ముగ్గురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కర్రలు, రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. టీడీపీ వర్గీయులు విచక్షణారహితంగా దాడిచేసి కొట్టడంతో ముగ్గురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలైయ్యాయి. ఈ ఘటనలో తొలుత వైఎస్సార్ సీపీ కార్యకర్తల కళ్లల్లోకి కారం చల్లి మరీ దాడులకు ఒడిగట్టారు.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వరుసగా జరిగిన వైఎస్సార్ సీపీ కార్యకర్తల హత్యలకు సంబంధించి చర్చించాలని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో పట్టుబడుతున్నా.. టీడీపీ నేతల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ హత్యా రాజకీయాల అంశాన్నిప్రక్కదోవ పట్టిస్తున్నటీడీపీ యధేచ్చగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులకు దిగుతోంది.
గురువారం పట్టణంలోని 4వ వార్డు పరిధిలోని ప్రజాశక్తి నగర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆ వార్డుకు చెందిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ పోలు లక్ష్మీనారాయణమ్మ భర్త శ్రీనివాసరెడ్డి, పోలు అంకిరెడ్డి, బారెడ్డి మల్లారెడ్డిపై కర్రలు, రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. టీడీపీ వర్గీయులు విచక్షణారహితంగా దాడిచేసి కొట్టడంతో ముగ్గురు వైఎస్సార్ సీపీ నాయకుల తలలు పగిలి తీవ్రరక్తస్రావమైంది.