కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన సవతి తండ్రి

కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన సవతి తండ్రి


కొయ్యలగూడెం :కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడంటూ జంగారెడ్డిగూడెం రోడ్డులోని 8వ వార్డులో నివాసం ఉంటున్న ఓ వ్యక్తిపై చైల్డ్ లైన్ జిల్లా కో-ఆర్డినేటర్  ఆల్‌ఫ్రెడ్ జేవియర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం రోడ్డులో ఎస్‌బీఐ బ్రాంచి సమీపంలో వెల్డింగ్ షాపు యజమాని పంపాని శేషగిరి 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. షాపు యజమాని తాడేపల్లిగూడెంలో నివసించే సమయంలో సుబ్బమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉండేవాడని, ఎనిమిది నెలల క్రితం ఆమె మరణించడంతో ఆమె కుమార్తె, కుమారుడిని కొయ్యలగూడెం తీసుకువచ్చి ఓ అద్దె ఇంటిలో ఉంచినట్టు కో-ఆర్డినేటర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

 ఈ నేపథ్యంలో కుమారుడిని తన వెల్డింగ్ షాపులోనే పనికి పెట్టి నిందితుడు తరచూ ఇంటికి వెళ్లి కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడన్నారు. ఈ విషయం స్థానికులు చైల్డ్‌లైన్ సెంటర్‌కు నాలుగు రోజుల క్రితం తెలిపారని, దీంతో చైల్డ్ లైన్ సిబ్బంది కొయ్యలగూడెం వచ్చి అద్దె ఇంటిలో ఉంచిన కుమార్తె వద్దకు వెళ్లి విచారించారన్నారు. ఈ నేపథ్యంలో కుమార్తె కన్నీళ్ల పర్యంతమై తనకు జరుగుతున్న ఘోరాన్ని వివరించింది. చైల్డ్‌లైన్ కేర్ సిబ్బంది బి.నరేంద్ర, ఎస్.రవిబాబు, ఎస్.సునీత పాల్గొన్నారు. దీనిపై ఎస్సై ఎస్‌ఎస్‌ఆర్ గంగాధర్ మాట్లాడుతూ నిందితుడు పంపాని శేషగిరి సుబ్బమ్మకు రెండవ భర్తగా వ్యవహరించాడని, ముందు భర్త పిల్లలు కావడం చేత ఇరువురిపై వేధింపులకు పాల్పడేవాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top