ఆశ్చర్యం!

అనంతపురం జిల్లా కూడేరు మండలం పి.నారాయణపురంలో మూడు అడుగుల లోతు గుంటలో నీరు ఊరుతున్న దృశ్యం.


 కూడేరు(అనంతపురం జిల్లా): ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షా భావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వందలాది అడుగుల లోతు బోర్లు వేయించినా  చుక్కనీరు  లభించడం గగనమైంది. నీటి కోసం ఇటు రైతులు, అటు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో   ఓ పక్కన ఎండలు మండుతుంటే మెట్ట ప్రాంతంలో  మూడు అడుగులు తవ్విన గుంతలో నీరు ఊరుతోంది. ఆ నీటిని చూసి ఇక్కడి  ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.



 కూడేరు మండలం పి.నారాయణపురంలో  కురుబ బండారు గోపాల్ అనే రైతు తన పొలంలో మామిడి మొక్కలు నాటేందుకు శనివారం 3 అడుగులు చొప్పున గుంటలు తవ్వించడం మెదలు పెట్టాడు. అందులో ఒక గుంటలో రెండు అడుగులు తవ్వగానే నీటి తేమ కనిపించింది. మూడు  అడుగులు తవ్వగానే నీరు ఉబకడం మొదలు పెట్టింది. సగం గుంతకు వచ్చిన నీటిని బయటకు తొలగించారు. ఆ గుంటలో  ఆదివారం మళ్ళీ నీరు ఊరడం మొదలు పెట్టింది. ఊట నీరు తియ్యగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.   ఈ విషయం తెలియడంతో ఆశ్చర్యపోతున్న గ్రామస్తులు గుంటలో  నీటిని చూసేందుకు  తరలివస్తున్నారు.



ఈ ప్రాంత రైతులు, ప్రజలు మాట్లాడుతు ఈ భూమికి కొద్ది దూరంలో ఒక  వంక ఉందని, అయితే  అక్కడ చుక్క నీరు కూడా లేదని చెప్పారు. కానీ  ఇక్కడ ఊహించిన రీతిలో గుంటలో నీరు ఊరడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు.













 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top