నన్ను పీఏగా రమ్మంటావా..!
ఎన్హెచ్ఏఐ ఎస్ఈపై అశోక్ గజపతిరాజు ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘నన్ను పీఏగా రమ్మంటావా..’ అంటూ జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఎస్ఈపై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే వంతెనకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం విషయమై ప్రతిపాదనలు అందలేదని ఎస్ఈ ఇచ్చిన సమాధానంతో అశోక్ గజపతిరాజు ఈ విధంగా తన అసహనం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో చేపట్టిన పలు ప్రాజెక్టులపై అశోక్ గజపతిరాజు సోమవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రి సుజయకృష్ణ రంగారావు, కలెక్టర్ వివేక్యాదవ్తో పాటు పలువురు జిల్లా అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. రైల్వే శాఖ పట్టణంలో నిర్మిస్తున్న వంతెనకు అప్రోచ్ రోడ్డు ఏర్పాటు విషయంలో జాప్యం ఎందుకు జరుగుతోందని అధికారులను నిలదీశారు. దీంతో ఎన్హెచ్ఏఐ ఎస్ఈ మనోహర్రెడ్డి లేచి.. తమకసలు ప్రతిపాదనలే అందలేదని బదులిచ్చారు. రైల్వే అధికారులు కల్పించుకుని ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. రైల్వే శాఖ ప్రతిపాదనలు పంపించామంటుంటే.. మీరు రాలేదంటున్నారేంటని అశోక్ గజపతిరాజు ఎస్ఈని నిలదీశారు. ఇంతవరకూ అవి తమకు అందలేదని ఎస్ఈ మళ్లీ స్పష్టం చేశారు. లోపం ఎక్కడుందో తెలుసుకోవాలి కదా అని అశోక్ అనడంతో.. అది మీరే తెలుసుకోవాలని ఎస్ఈ బదులిచ్చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన కేంద్ర మంత్రి.. ‘మీ పనులు చూసేందుకు నన్ను మీ పీఏగా రమ్మంటారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.