గర్జించిన గరగపర్రు


పాలకోడేరు: పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామం ఆదివారం అట్టుడికింది. ఖాకీల నియంతృత్య పోకడలు, అడుగడుగునా నిఘాతో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. అర్ధరాత్రి దాటిన తర్వాత దళిత నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో వేకువజాము నుంచే నిరసనలు హోరెత్తాయి. గ్రామంలోని పలు కూడళ్లలో పోలీసులు పహారా కాశారు. భీమవరం– తాడేపల్లిగూడెం రహదారిలో యండగండి వద్ద, ఇటు గొల్లలకోడేరు వద్ద పెద్దెత్తున పోలీసులు మోహరించి ఎవరినీ గ్రామంలోకి వెళ్లనివ్వకుండా కట్టుదిట్టం చేశారు. నాయకులను అరెస్ట్‌ చేశారనే సమాచారం అందుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, సీపీఎం నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం, మాలమహానాడు, వివిధ ప్రజా సంఘాల నాయకుల్లో అడ్డదారుల్లో గ్రామానికి చేరుకున్నారు. దళితులను పరా మర్శించి, సభలు, సమావేశాలు నిర్వహించారు.



ఎమ్మెల్యే గో బ్యాక్‌

అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజును చూసి ఎమ్మెల్యే గోబ్యాక్‌ అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. దళితులకు చేసిందేమిటని, ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని, నిందితులకు వత్తాసు పలుకుతున్నారని ఆయన్ను నిలదీశారు. న్యాయం చేస్తానని ఎమ్మెల్యే శివ బదులిచ్చినా మీరేమి న్యాయం చేయక్కర్లేదు, ఇప్పటివరకూ చేసింది చాలు గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేయడంతో ఆయన మిన్నకుండిపోయారు. జాయింట్‌ కలెక్టర్‌ పులిపాటి కోటేశ్వరరావు, అడిషనల్‌ ఎస్పీ రత్న, సబ్‌కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ, తదితర అధికారులు అక్కడికి చేరుకున్నారు.



విపక్షాల నిలదీత

దళితులను బహిష్కరణకు గురిచేసిన ఇందుకూరి బలరామకృష్ణంరాజును ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదంటూ విపక్షాల నాయకులు అధి కారులు, పోలీసులను నిలదీశారు. జాయింట్‌ కలెక్టర్‌ పులిపాటి కోటేశ్వరరావు తదితర అధికారులు గ్రామంలో మౌలిక వసతులు, ఉపాధి కల్పిస్తాం అని చెప్పడం మినహా నిం దితుల అరెస్ట్‌ గురించి ప్రస్తావించకపోవడంతో విపక్షాల నాయకులు మరింత ఆగ్రహించారు.



నిందితుడిని అరెస్ట్‌ చేయడానికి ఎంత సమయం పడుతుందని వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర చైర్మన్‌ మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు, రాష్ట్ర కార్యదర్శి శ్రీకాకుళం పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌ కొయ్యే మోషేన్‌రాజు ఎస్సీ, సెల్‌ జిల్లా చైర్మన్‌ మానుకొండ ప్రదీప్, జిల్లా యూత్‌ అధ్యక్షుడు మంతెన యోగీంద్రకుమార్‌ అడిషనల్‌ ఎస్పీ రత్నను ప్రశ్నించారు. ఉద్యమాన్ని మరింత పెంచుతున్నారే తప్ప తగ్గించేందుకు  చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.



ఉపాధి కల్పించి శాంతియుత వాతావరణం నెలకొల్పామని, ఇప్పటికే కేసు నమోదు చేశామని పరిస్థితులు చక్కబడిన తర్వాత అరెస్ట్‌లు చేస్తామని ఆమె సమాధానమిచ్చినా నాయకులు శాంతించలేదు. నిందితుడిని అరెస్ట్‌ చేస్తేనే పరిస్థితులు చక్కబడతాయని నాయకులు స్పష్టం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, మాజీ ఎమ్మెల్సీలు జెల్లి విల్సన్, పీజే చం ద్రశేఖర్, నెక్కంటి సుబ్బారావు, తాటిపాక మ« దు, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్, సీపీఎం జిల్లా నాయకులు జేఎన్‌వీ గోపాలన్, రైతు సంఘం నాయకులు ధనికొండ శ్రీనివాస్, అ ల్లూరి అరుణ్‌ తదితరులు దళితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు.



గొల్లలకోడేరులో ధర్నా

గరగపర్రులో దళితులను పరామర్శించడానికి వచ్చిన మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు నల్లి రాజేష్, రాష్ట్ర కార్యదర్శి గంటా సుందర్‌కుమార్, జిల్లా సమన్వయకర్త, నన్నేటి పుష్పరాజు, డివిజన్‌ కార్యదర్శి ఇట్టా రమేష్, గుండె నగేష్, ఉండి నియోజకవర్గ కన్వీనర్, తంగెళ్ల యాకోబు, పాలకోడేరు మండల అధ్యక్షుడు ఈది భాస్కరావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో గొల్లలకోడేరు వద్ద దళిత సంఘాల నాయకులు పెద్దెత్తున నిరసన తెలిపి కొద్దిసేపు ధర్నా నిర్వహించారు.



అర్ధరాత్రి అరెస్ట్‌లు

శనివారం అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని దళితవాడ చర్చిలో నిద్రిస్తున్న నాయకుల వద్దకు పెద్దెత్తున పోలీసులు మోహరించి అరెస్ట్‌ చేశారు. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, ఏపీ దళిత మహాసభ అధ్యక్షుడు చింతపల్లి గురుప్రసాద్‌ తదితరులను అదుపులోకి తీసుకుని ఇతర పోలీస్‌స్టేషన్లకు తరలించారు. హర్షకుమార్‌ను రాజానగరం పోలీస్‌స్టేషన్‌లో హాజరుపరిచి అనంతరం హౌస్‌ అరెస్ట్‌ చేశా రు. కొందరిని నరసాపురం, పెదవేగి స్టేషన్లకు తరలించారు. కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని పీవీ రావు మాలమహానాడు అధ్యక్షుడు గుమ్మాపు సూర్యవరప్రసాద్‌ విమర్శించారు.



నిందితుడిని అరెస్ట్‌ చేయాలి: మేరుగ

తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నా గార్జున విమర్శించారు. రెండు నెలలుగా గరగపర్రులో దళితులు బహిష్కరణకు గురై ఆకలితో అలమటిస్తున్నా ఎమ్మెల్యే శివకు పత్తా లేకుండాపోయిందని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో మధ్యయుగాల నాటి పరిస్థితులు తలెత్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుచేయడం అగ్రవర్ణాల దృష్టిలో నేరమైపోయిందా అని ప్రశ్నించారు. దళితులపై కక్ష సాధిస్తున్న ఇందుకూరి బలరామకృష్ణంరాజును తక్షణమే అరెస్ట్‌ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బాధితులకు  అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే సర్రాజు భరోసా ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top