స్థానిక కమిటీలను నియమించండి..
విజయనగరం మున్సిపాలిటీ: జిల్లా పార్టీ కమిటీతో పాటు మండల పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు వేసి పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ జిల్లా నాయకులకు సూచించారు. హైదరాబాద్ వెళ్లిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల.వీరభద్రస్వామితో పాటు పలువురు నాయకులు బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో జగన్మోహన్రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి జిల్లాలో పార్టీ పటిష్టతకు అవసరమైన కార్యక్రమాలపై , కోలగట్లతో చర్చించారు. డ్వాక్రా, రైతు రుణమాఫీ అమలుతో పాటు హుదూద్ తుపాను బాధితుల నష్టపరిహారం తదితర అంశాలపై పిలుపునిచ్చి నవంబర్5న మండల కేంద్రాల్లో ధర్నాను విజయవంతంగా నిర్వహించాలని జగన్ సూచించారు. తద్వారా బాధితులకు అండగా నిలిచి వారి వాణిని ప్రభుత్వానికి వినిపించాలని స్పష్టం చేశారు. జగన్మోహన్రెడ్డిని కలిసిన వారిలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, కేవీ.సూర్యనారాయణరాజు, కాకర్లపూడి శ్రీనివాసరాజు, ఎస్.బంగారునాయుడు, పతివాడ. అప్పలనాయుడు ఉన్నారు.