రాత్రికి రాత్రే మార్చేశారు...
వీరఘట్టం: మరో రెండు రోజుల్లో సాధారణ బదిలీలు జరగాల్సి ఉన్నా వీరఘట్టం ఏపీవో జె. జె.శంకరావును సోమవారం రాత్రి డ్వామా కార్యాలయానికి సరెండర్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆయన స్థానంలో నరసన్నపేటకు చెందిన పి.శ్రీనివాసరావును నియమిస్తూ ఆదేశాలు సైతం జారీచేశారు. ఆయన మంగళవారం బాధ్యతలు కూడా స్వీకరించారు. ఈ తతంగమంతా రాత్రికిరాత్రే చేపట్టడం వెనుక రాజకీయ ఒత్తిళ్లే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ కథ...
వీరఘట్టం ఏపీవో శంకరావును డ్వామాకు సరెండర్ చేయడం వెనుక పెద్దకథే నడిచినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నాయకులు ప్రతిపాదించిన పనులను శంకరావు చేపట్టడం లేదని, ఐదు నెలలు కిందట తూడి గ్రామానికి ఉపాధిహామీ పథకం నిధులతో వేసిన రోడ్డుకు బిల్లులు మంజూరు చేయడంలో అడ్డుతగులుతున్నాడన్న అక్కుసుతో అధికార పార్టీ నాయకులే ఈ పనికి పూనుకున్నట్టు సమాచారం. గత నెల 10న శంకరరావుకు మావోయిస్టులు రాసినట్లు ఓ బెదిరింపు లేఖ కూడా వచ్చింది.
ఫీల్డ్అసిస్టెంట్లతో కుమ్మక్కై ఉపాధి హామీ పథకంలో చేతివాటం చూపిస్తున్నారంటూ, తక్షణమే వీరఘట్టం నుంచి బదిలీపై వె ళ్లిపోవాలని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంపై అప్పటిలో ఏపీవో పోలీసులను సంప్రదించగా ఇది బోగస్ లేఖగా నిర్ధారించారు. స్థానికంగా గమనిస్తున్నవారే రాసి ఉంటారని గుర్తించారు. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో బదిలీపై వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఏపీవోను డ్వామాకు సర ండెర్ చేసి తమ అధికార దర్పాన్ని ప్రదర్శించుకున్నారని అధికార పార్టీ నాయకులపై పలువురు ఉపాధి హామీ సిబ్బందిపై మండిపడుతున్నారు.