123 సంస్థలు తెలంగాణవట..
రాష్ట్రపతికి నివేదించిన సీఎస్
ఏపీ, తెలంగాణల మధ్య వివాదాలపై లేఖ సమర్పణ
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వివరించారు. విభజన చట్టం పదవ షెడ్యూల్లో పేర్కొన్న 142 సంస్థల్లో 123 సంస్థలు మావేనని తెలంగాణ ప్రభుత్వం అంటోందని తెలిపారు. పదవ షెడ్యూల్లో గల సంస్థల సేవలను రెండు రాష్ట్రాలు పొందేలా రాష్ట్ర విభజన అనంతరం ఏడాదిలోగా ఒప్పందాలు చేసుకోవాల్సి ఉందని, అయితే చాలా సంస్థల కు సంబంధించి ఒప్పందాలు జరగలేదని తెలిపారు. విభజన జరిగి ఏడాది పూర్తై నేపథ్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గల 123 సంస్థలు తెలంగాణకే చెందుతాయని, ఈ సంస్థల నుంచి సేవలు పొందాలంటే చార్జీలు చెల్లించాలని ఆ రాష్ట్రం అంటోందని వివరించారు.
ఆయా సంస్థల్లోని ఆంధ్రాకు చెందిన ఉద్యోగులను ఏకపక్షంగా రిలీవ్ చేస్తోందని పేర్కొన్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ను కలసిన సీఎస్ ఈ మేరకు మూడు పేజీల లేఖ సమర్పించారు. విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో శాంతిభద్రతల పరిరక్షణ అధికారాన్ని గవర్నర్కు అప్పగించాలని, సెక్షన్-8 అమల్లో లేనందున జంటనగరాల్లో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్కు అప్పగించాలని కోరారు.
సంబంధిత వార్తలు