వైఎస్ జగన్ పర్యటనలో అధికారుల నిర్లక్ష్యం

వైఎస్ జగన్ పర్యటనలో అధికారుల నిర్లక్ష్యం - Sakshi


విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన ఏర్పాట్లలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తాళాలు మరిచిపోయిన ప్రభుత్వ సిబ్బంది వాహనం డోర్‌ను లాక్ చేశారు. ప్రొటోకాల్ అధికారుల నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనంగా కనిపిస్తోంది. దీంతో మరో వాహనం కోసం శ్రీకాకుళం ఎస్పీకి సమాచారం ఇచ్చారు. కానీ అక్కడినుంచి వాహనం రావడానికి గంటన్నర సమయం పట్టే అవకాశం ఉండటంతో అధికారులు, సిబ్బంది హైరానా పడుతున్నారు.



వైజాగ్ పోలీస్ కమిషనర్‌కు కూడా సమాచారం ఇచ్చారు. వేరే వాహనం వచ్చేలోగా వైఎస్ జగన్‌ వస్తే పరిస్థితి ఏమిటని పోలీసులు, ప్రొటోకాల్‌ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయంగా వైఎస్సార్‌సీపీ నేతలు ప్రైవేటు వాహనం ఏర్పాటు చేస్తుండగా విశాఖ కమిషనర్‌ వేరే వాహనాన్ని ఏర్పాటు చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో లాక్ పడిన వాహనం ఫొటోలు తీస్తున్న ‘సాక్షి’  ఫొటోగ్రాఫర్లపై పోలీసుల చిందులు తొక్కడం గమనార్హం.



మరోవైపు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు బయలుదేరిన వైఎస్ జగన్ విశాఖ నేటి ఉదయం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ప్రియతమ నేత వైఎస్ జగన్‌కు వైఎస్ఆర్‌సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో శ్రీకాకుళం చేరుకుంటారు. పాతపట్నం నియోజకవర్గంలోని హీర మండలంలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖీ  కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top