సింహం సింగిల్‌గానే వస్తుంది: ఎమ్మెల్యే రోజా

టీడీపీ గెలిచినట్లా...? ఓడినట్లా?: రోజా - Sakshi


అమరావతి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నైతికంగా గెలిచిందని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. సింహం సింగిల్‌గానే వస్తుందని, ప్రజాక్షేత్రంలో గెలిచి తీరుతామని ఆమె వ్యాఖ్యానించారు. సోమవారమిక్కడ ఆమె మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ..‘ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు శిక్ష పడకపోవడం వల్లే మళ్లీ ఏపీలో కోట్లు ఖర్చుపెట్టి గెలిచారు. రూ.300 కోట్లు ఖర్చు పెట్టి ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిచింది సీఎం చంద్రబాబే. కర్నూలులో శిల్పా చక్రపాణి గతంలో 147 ఓట్లతో గెలిచారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారిన తర్వాత మెజార్టీ 57కు తగ్గింది. మరి టీడీపీ గెలిచినట్లా...? ఓడినట్లా?.


ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటున్నారు. మీకు నిజంగా ప్రజాబలం ఉంటే కొనుగోలు చేసిన 21మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?. మంత్రి గంటా శ్రీనివాసరావు పాలన గాలికి ఒదిలేసి ఓట్లు కొనుక్కోవడంలో బిజీగా ఉన్నారు. ఆయన సొంత జిల్లాలో డిగ్రీ పేపర్‌ లీకైంది. ఇంఛార్జ్‌గా ఉన్న జిల్లాలో పదో తరగతి పేపర్లు లీకైయ్యాయి. ఇక మంత్రి నారాయణ కాలేజీలో టెన్త్‌ తెలుగు, హిందీ పేపర్లు లీక్‌ అయ్యాయి.



జనాల సమస్యలు గాలికి వదిలేసి కోట్లు ఖర్చుపెట్టి ఓట్లు కోనుగోలు చేయడం సిగ్గుచేటు. చంద్రబాబుకు అంత ధైర్యం ఉంటే లోకేశ్‌ ను ఎందుకు పోటీలో నిలబెట్టలేదు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయిన చరిత్ర ఉంది. అయినా టీడీపీ ఎమ్మెల్యేలు ఏ మొహం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చారు. గతంలో ఉప ఎన్నికల్లో టీడీపీ 18 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఆ చరిత్ర మరిచిపోతే ఎలా?. ఎంపీటీసీలు, జడ్పీటీసీలను కొని గెలవడం గెలుపు కాదు’ అని ఎద్దేవా చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top