హోంమంత్రి రాజప్పకు కోపం వచ్చింది

హోంమంత్రి రాజప్పకు కోపం వచ్చింది - Sakshi


అమలాపురం : రాష్ట్ర హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు కోపమొచ్చింది. తనకు సెక్యూరిటీ అవసరం లేదంటూ ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది తన ఇంటి ఆవరణ నుంచి వెళ్లిపోవాలని రాజప్ప ఆదేశించారు. దాంతో సెక్యూరిటీ సిబ్బందితో పాటు, స్థానిక పోలీస్ అధికారులు అవాక్కయ్యారు.



ఇటీవల అంబాజీపేట మండలంలో దీపావళి రోజున రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన గొడవలో పోలీసుల తీరు రాజప్పకు నచ్చక కొంత అసహనానికి గురైట్లు సమాచారం. అమలాపురంలో ఉన్న ఆయనను కలిసేందుకు ప్రొటోకాల్ ప్రకారం కొందరు అధికారులు మంగళవారం వెళ్లారు. ఆ సమయంలో రాజప్ప వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెక్యూరిటీ సిబ్బందిని ఇంటి ఆవరణ నుంచి ఖాళీ చేయాలని ఆదేశించారు. 'మీ సెక్యూరిటీ నాకు అవసరం లేదు...మీరూ అవసరం లేద'ని రాజప్ప అసహనం వ్యక్తం చేశారు.  అనంతరం ఆయన అమలాపురం పర్యటన ముగించుకుని రాజప్ప తన నియోజకవర్గం పెద్దాపురం వెళ్లిపోయారు.



కాగా ఈ విషయమై  పోలీసు అధికారులను వివరణ కోరగా... చినరాజప్ప స్థానికంగా లేనప్పుడు సెక్యూరిటీ అవసరం లేదని చెప్పారన్నారు. కేబినెట్ సమావేశం ఉన్నందున హోంమంత్రి హైదరాబాద్ వెళుతున్న నేపథ్యంలోనే సెక్యూరిటీ వద్దన్నారని పోలీసు అధికారులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top